UPI Payments Foreigners | విదేశీ పర్యాటకులకు గూగుల్ పే (జీ-పే), ఫోన్పే వంటి యూపీఐ పేమెంట్స్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఈ సంగతి ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. ఆరో తేదీ నుంచి మూడు రోజుల పాటు జరిగిన ద్రవ్య పరపతి సమీక్ష సమావేశం వివరాలను శక్తికాంత దాస్ బుధవారం మీడియాకు వివరించారు. రెపోరేట్ 25 బేసిక్ పాయింట్లు పెంచడంతోపాటు విదేశీ పర్యాటకులకు తీపి కబురు అందించారు.
విదేశీ పర్యాటకులు దేశంలో పర్యటించినప్పుడు ఆయా ప్రాంతాల్లోని మర్చంట్స్ వద్ద యూపీఐ పేమెంట్స్కు అనుమతి ఇస్తున్నట్లు శక్తికాంత దాస్ తెలిపారు. జీ-20 దేశాల పౌరులకు దేశంలోని వివిధ మర్చంట్లు, ఎంపిక చేసిన అంతర్జాతీయ విమానాశ్రయాల వద్ద జీ-పే, ఫోన్పే తదితర మొబైల్ యాప్స్ ద్వారా పేమెంట్స్కు ఆర్బీఐ అనుమతి ఇచ్చింది.
అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, రిపబ్లిక్ ఆఫ్ కొరియా (దక్షిణ కొరియా), సౌతాఫ్రికా, తుర్కియే, ఇండోనేషియా, ఇటలీ, బ్రిటన్, అమెరికా, యూరోపియన్ యూనియన్ (ఈయూ) సభ్య దేశాలు.. జీ-20 గ్రూప్లో భాగస్వామ్యులు. ఈ దేశాల పౌరులు, ప్రతినిధులకు దేశవ్యాప్తంగా యూపీఐ పేమెంట్స్ అనుమతిస్తారు. అయితే, ఏయే అంతర్జాతీయ విమానాశ్రయాలను ఎంపిక చేశారన్న సంగతి మాత్రం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ బయట పెట్టలేదు. ఇటీవలి కాలంలో యూపీఐ పేమెంట్స్ వేగం పుంజుకుంటున్నాయి. ఇదే ఒరవడిని ముందుకు కొనసాగించాలని, యూపీఐ పేమెంట్స్ను విస్తరించాలని ఆర్బీఐ భావిస్తున్నది.