RBI | ముంబై, ఫిబ్రవరి 8: త్వరలో వడ్డీ రేట్లు తగ్గుతాయంటూ రిజర్వ్బ్యాంక్ వెల్లడించే సంకేతాల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నవారికి నిరాశే ఎదురయ్యింది. అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులకు తోడు ద్రవ్యోల్బణం 4 శాతానికి దించాల్సిన అవసరం ఉన్నందున కీలక పాలసీ రేటును యథాతథంగా అట్టిపెడుతున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. రెపో రేటును 6.5 శాతం వద్దే ఉంచడం వరుసగా ఇది ఆరోసారి. అలాగే సమీప భవిష్యత్తులో వడ్డీ రేట్ల పట్ల ఆర్బీఐ వైఖరిని సైతం మార్పు చేయలేదు. మరికొంతకాలం గరిష్ఠస్థాయిలోనే వడ్డీ రేట్లు ఉంటాయని సూచిస్తూ ‘విత్డ్రాయిల్ ఆఫ్ అకామిడేషన్’ (కఠిన ద్రవ్య విధానం) వైఖరిని కొనసాగిస్తామని పేర్కొంది. మూడు రోజుల ద్రవ్య పరపతి విధాన సమీక్ష అనంతరం మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) నిర్ణయాల్ని గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం వెల్లడించారు. తాజా పాలసీలో ఆరుగురు ఎంపీసీ సభ్యుల్లో ఐదుగురు అనుకూలంగా ఓటు వేయగా, ఒక్కరు వ్యతిరేకంగా వేశారు.
వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25) దేశ జీడీపీ వృద్ధిరేటు 7 శాతంగానే ఉండొచ్చని ఆర్బీఐ అంచనా వేసింది. ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) 7.3 శాతంగా ఉంటుందని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్వో) అంచనా వేస్తున్నది. దీంతో రాబోయే ఆర్థిక సంవత్సరం కొంత ఇబ్బందికర పరిస్థితులేనన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. నిజానికి గత ఆర్థిక సంవత్సరం (2022-23)లోనూ దేశ వృద్ధిరేటు 7.2 శాతంగా నమోదైంది. కానీ ఆర్బీఐ తాజా అంచనాలతో జీడీపీ మరింత క్షీణిస్తుందని అర్థమవుతున్నది.
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, సరఫరా మార్గాలకు ఆటంకం ఏర్పడటం, అంతర్జాతీయ ఫైనాన్షియల్ మార్కెట్ల ఒడిదుడుకులు ఆర్థికాభివృద్ధికి రిస్క్గా భావిస్తున్నాం
– శక్తికాంత దాస్, ఆర్బీఐ గవర్నర్