ముంబై : రూ. 500 నోట్లను ఉపసంహరించడం లేదా రూ. 1000 నోట్లను తిరిగి ప్రవేశపెట్టే దిశగా ఎలాంటి ఆలోచన చేయడం లేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ (RBI Monetary Policy) స్పష్టం చేశారు. పెద్ద నోట్లపై ప్రజలకు ఎలాంటి ఊహాగానాలు అవసరం లేదని పేర్కొన్నారు. రూ. 2000 నోట్లను ప్రభుత్వం ఇటీవల చలామణి నుంచి ఉపసంహరించిన క్రమంలో ఆర్బీఐ గవర్నర్ ఈ మేరకు వివరణ ఇచ్చారు.
మార్కెట్లో చలామణిలో ఉన్న రూ. 2000 నోట్లలో సగం నోట్లు తిరిగి వచ్చాయని చెప్పారు. బ్యాంకులకు తిరిగివచ్చిన రూ. 2000 నోట్ల విలువ రూ. 1.82 లక్షల కోట్లుగా నమోదైంది. ఇక బ్యాంకులకు తిరిగివచ్చిన 2000 రూపాయల నోట్లలో 85 శాతం బ్యాంక్ డిపాజిట్ల రూపంలో రాగా, మిగిలినవి నోట్ల మార్పిడి జరిగిందని శక్తికాంత దాస్ పేర్కొన్నారు. కాగా, ద్రవ్య విధాన సమీక్షలో భాగంగా వడ్డీ రేట్ల పెంపు విషయంలో ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది.
విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే ఈసారి కూడా కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్షలో తీసుకున్న నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం ప్రకటించారు. రెపో రేటు 6.50 శాతం వద్ద అలాగే కొనసాగుతుందని తెలిపారు. ఎస్డీఎఫ్ రేటు 6.25 శాతం, ఎంఎస్ఎఫ్ రేటు 6.75 శాతం, బ్యాంక్ రేటు 6.75 శాతం వద్ద స్థిరంగా ఉంటాయని వెల్లడించారు.
Read More
RBI Monetary Policy | రుణగ్రహీతలకు ఉపశమనం.. వడ్డీ రేట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ