Paytm | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై తాము ప్రకటించిన చర్యల్ని సమీక్షించే ప్రసక్తే లేదని రిజర్వ్బ్యాంక్ గవర్నర్ శక్తికాంతదాస్ స్పష్టం చేశారు. ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం బ్యాంక్ డిపాజిట్లు తీసుకోరాదని, కస్టమర్ ఖాతాలు, వ్యాలెట్లలో టాప్ అప్స్. ఫాస్ట్ట్యాగ్స్, ప్రీపెయిడ్ సాధనాలు ఇవ్వరాదంటూ జనవరి 31న ఆర్బీఐ నిషేధ చర్యల్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఆర్బీఐ సెంట్రల్ డైరెక్టర్ల బోర్డు 606వ సమావేశం అనంతరం సోమవారం శక్తికాంతదాస్ మీడియాతో మాట్లాడుతూ ‘పేటీఎంపై మా నిర్ణయాన్ని సమీక్షిస్తామని మీరు (మీడియా) భావిస్తున్నట్టయితే ఒకటి స్పష్టంగా చెప్పదలుచుకున్నా, నిర్ణయాన్ని సమీక్షించేదే లేదు’ అని కుండబద్దలు కొట్టారు.
ఆర్బీఐ నియంత్రణలో ఉన్న సంస్థలపై సమగ్రంగా విశ్లేషించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని దాస్ చెప్పారు. ఫిన్టెక్ రంగానికి ఆర్బీఐ మద్దతుగా నిలుస్తుందని, ఇదే సమయంలో ఖాతాదారుల ప్రయోజనాల్ని సంరక్షించడం, ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించడానికి కట్టుబడి ఉంటుందని వివరించారు.
విత్డ్రాయిల్స్కు అనుమతి
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీఎల్) నిర్వహించే కొన్ని కార్యకలాపాల్ని నిలిపివేస్తున్నప్పటికీ, మరికొన్నింటిని ఆర్బీఐ అనుమతించింది. ఫిబ్రవరి 29 తర్వాత కూడా ఫిబ్రవరి 29 పీపీబీఎల్ ఖాతాదారులు వారి వివిధ ఖాతాల్లో (సేవింగ్స్, కరెంట్ ఖాతాలు, ప్రీపెయిడ్ ఇనుస్ట్రుమెంట్స్, ఫాస్ట్ట్యాగ్స్, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డులు) బ్యాలెన్స్ను ఎటువంటి నియంత్రణలు లేకుండా విత్డ్రా చేసుకోవచ్చు. ఇతరత్రా వాడుకోవచ్చు. బ్యాంక్ తన కస్టమర్ల ఖాతాల్లో వడ్డీ జమచేయవచ్చు.
ఈ వారంలో ఎఫ్ఏక్యూ
పేటీఎం అంశంపై తలెత్తే సందేహాలు, వాటికి సమాధానాల్ని వివరిస్తూ ఈ వారంలో ఎఫ్ఏక్యూల సెట్ను (ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్) రిజర్వ్బ్యాంక్ విడుదల చేయనుంది. పీపీబీఎల్ కస్టమర్లకు సంబంధించిన వివిధ అంశాలతో వివరణల జాబితాతో కూడిన ఎఫ్ఏక్యూ సెట్ను తీసుకొస్తామని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. ఖాతాదారులు ఇబ్బందులకు లోనుకాకూడదన్నదే తమ ప్రాధాన్యత అని, వారి ప్రయోజనాలు తమకు చాలా ముఖ్యమని చెప్పారు.