ముంబై, ఆగస్టు 24: ఇంటర్నెట్ సదుపాయం లేని, అంతంతమాత్రంగా ఉన్న చోట్లలో యూపీఐ-లైట్ వ్యాలెట్ వినియోగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ఆఫ్లైన్ లావాదేవీ గరిష్ఠ పరిమితిని గురువారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రూ.500లకు పెంచింది. ఈ మేరకు ఓ సర్క్యులర్ను విడుదల చేసింది. ఇప్పటిదాకా ఇది రూ.200లుగానే ఉన్న విషయం తెలిసిందే. అయితే పేమెంట్ సాధనంపై ఆఫ్లైన్ లావాదేవీలకున్న మొత్తం పరిమితిని రూ.2,000లుగానే ఉంచింది. నిజానికి ఈ నెలారంభంలో జరిగిన ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో ఆర్బీఐ ఈ ప్రతిపాదనను ప్రకటించిన సంగతి విదితమే. ఈ క్రమంలోనే దాన్నిప్పుడు అధికారికంగా అమల్లోకి తెచ్చింది. ఇంటర్నెట్ లేదా టెలికం కనెక్టివిటీ అందుబాటులో లేనప్పుడు చిన్న మొత్తాల్లో నగదు లావాదేవీలకు ఊతమిచ్చేందుకే గత ఏడాది సెప్టెంబర్లో యూపీఐ-లైట్ను ప్రారంభించారు. ఇందులో గరిష్ఠంగా రూ.200ల వరకే పంపే వీలుండటంతో దాన్ని రూ.500లకు పెంచారు. ఈ నిర్ణయం వినియోగదారులకు కలిసిరాగలదన్న ఆశాభావాన్ని ఆర్బీఐ వ్యక్తం చేస్తున్నది.
అందుకే వడ్డీరేట్లు యథాతథం
స్థూల ద్రవ్యోల్బణంపై ఆహారోత్పత్తుల ధరల ప్రభావం నేపథ్యంలోనే కీలక వడ్డీరేట్లను ఇటీవలి ద్రవ్యసమీక్షలోనూ ఆర్బీఐ యథాతథంగా ఉంచింది. ఈ నెల 8-10 తేదీల్లో జరిగిన ద్రవ్యసమీక్ష సమావేశం మినిట్స్ను గురువారం ఆర్బీఐ విడుదల చేసింది. ఆరుగురు సభ్యులున్న మానిటరీ పాలసీ కమిటీలో అందరూ రెపోరేటును 6.5 శాతం వద్దే ఉంచాలని నిర్ణయించారు. ‘ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయాలన్న మా టాస్క్ ఇంకా ముగియలేదు. ఎప్పుడూ హెచ్చుతగ్గులకు లోనయ్యే కూరగాయల ధరలు.. ప్రధాన ద్రవ్యోల్బణాన్ని ఈసారీ ప్రభావితం చేస్తున్నాయి. అందుకే వడ్డీరేట్ల జోలికి వెళ్లకుండానే ద్రవ్యసమీక్షను ముగించాం’ అని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు.