Mahesh Bank | సైబర్ సెక్యూరిటీపై హైదరాబాద్ నగర పెతాస్ సైబర్ క్రైమ్ వింగ్ పనితీరుకు అద్దం పట్టే చర్య వెలుగు చూసింది. ఏపీ మహేశ్ కో-ఆపరేటివ్ బ్యాంక్.. మహేశ్ బ్యాంక్.. సెబర్ సెక్యూరిటీ నిబంధనలను అమలు చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని హైదరాబాద్ నగర సైబర్ క్రైమ్ వింగ్ దర్యాప్తులో తేల్చింది. దీంతో మహేశ్ బ్యాంకుపై ఆర్బీఐ రూ.65 లక్షల ఫైన్ విధించింది.
గతేడాది జనవరి 24న ఏపీ మహేశ్ కోఆపరేటివ్ బ్యాంకు ఖాతాలను నైజీరియాకు చెందిన హ్యాకర్ల ముఠా హ్యాక్ చేసి రూ.12.48 కోట్లను వివిధ ఖాతాలకు మళ్లించుకున్నది. దీనిపై మహేశ్ బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు హైదరాబాద్ నగర సైబర్ క్రైమ్ వింగ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సైబర్ భద్రతను మహేశ్ బ్యాంక్ యాజమాన్యం గాలికి వదిలేసిందని సైబర్ క్రైమ్ వింగ్ పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసులో దేశవ్యాప్తంగా దర్యాప్తు చేసిన సైబర్ క్రైం వింగ్ పోలీసులు.. నైజీరియన్ హ్యాకర్ల ముఠాతోపటాు ఈ మోసంలో పాలు పంచుకున్న పలువురు వ్యక్తులను విచారించారు
నైజీరియన్ హ్యాకర్ల ముఠా.. మహేశ్ బ్యాంక్ సిబ్బందికి ఫిషింగ్ మెయిల్స్ పంపి.. సర్వర్ లోకి చొరబడినట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ వింగ్ పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. ఇదే అంశాన్ని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ దృష్టికి తీసుకెళ్లారు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్. మహేశ్ బ్యాంక్ లైసెన్సు రద్దు చేయాలని సూచించారు.
చట్టపరంగా ఒక బ్యాంకు లైసెన్స్ రద్దు చేయడం సాధ్యం కాకపోవడంతో మహేశ్ బ్యాంకుపై ఆర్బీఐ రూ.65 లక్షల ఫైన్ విధించింది. సైబర్ భద్రతా ప్రమాణాలను పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఒక బ్యాంకుపై ఆర్బీఐ ఫైన్ విధించడం ఇదే తొలిసారి అని సీవీ ఆనంద్ తెలిపారు. ప్రజల డబ్బు, కీలక డేటా చోరీ కాకుండా బ్యాంకులన్నీ సైబర్ సెక్యూరిటీ పద్ధతులు పాటించాలని సూచించారు.