RBI on GDP | ధరలను కట్టడి చేయడానికి మరో 50 బేసిక్ పాయింట్లు రెపోరేట్ పెంచిన ఆర్బీఐ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనాల్లో కోత విధించింది. 2022-23 ఆర్థిక సంవత్సర జీడీపీ కేవలం ఏడు శాతమే ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. గత ఏప్రిల్లో జీడీపీ 7.2 శాతం ఉండొచ్చొనని ఆర్బీఐ అంచనా వేసింది.
ద్రవ్య పరపతి సమీక్షపై శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అంతర్జాతీయంగా వివిధ దేశాలు ద్రవ్య పరపతి విధానాలను కఠినతరం చేస్తున్న నేపథ్యంలో వృద్ధిరేటు తగ్గుతుందన్నారు.ధరల్లో స్థిరీకరణ ద్వారానే సుస్థిర అభివృద్ధికి ఆర్బీఐ కట్టుబడి ఉందని శక్తికాంత దాస్ చెప్పారు. అయితే, 2022-23 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో జీడీపీ 13.5 శాతంగా నమోదైంది.
ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న ధరలను, ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి వివిధ దేశాలు ద్రవ్య పరపతి విధానాన్ని కఠినతరం చేయడంలో దూకుడుగా ఉంటాయని శక్తికాంత దాస్ హెచ్చరించారు. తొలుత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 7.8 శాతంగా నిర్ధారించారు. తదుపరి ఈ ఏడాది వృద్ధిరేటు 7.2 శాతం అని ఏప్రిల్లో ఆర్బీఐ ఇంతకుముందు అంచనా వేసింది.