ముంబై, సెప్టెంబర్ 30: దేశ జీడీపీ వృద్ధిరేటుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కోత పెట్టింది. ఈ ఆర్థిక సంవత్సరానికి (2022-23)గాను గతంలో వేసిన అంచనాను శుక్రవారం ద్రవ్య సమీక్ష సందర్భంగా కుదించింది. తాజా సమావేశంలోనూ రెపో రేటును మరో 50 బేసిస్ పాయింట్లు ఆర్బీఐ పెంచింది. ద్రవ్యోల్బణం అదుపే లక్ష్యంగా కీలక వడ్డీరేట్లను పెంచుతూపోతున్న ఆర్బీఐ ఈసారి కూడా అదే తీరును కనబర్చింది. ఈ క్రమంలోనే దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతున్న ప్రతికూల సంకేతాలను ప్రతిబింబిస్తూ జీడీపీ అంచనానూ తగ్గించింది. ఇప్పటిదాకా భారత వృద్ధిరేటు 7.2 శాతంగా అంచనా వేస్తూ వచ్చిన ఆర్బీఐ.. ఇప్పుడు దాన్ని 7 శాతమే అన్నది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతుండటం, ప్రపంచవ్యాప్తంగా కఠిన ద్రవ్యవిధానాలు అమలవుతుండటంతో ఆ ప్రభావం భారత జీడీపీపైనా పడుతున్నదని రిజర్వ్ బ్యాంకు గవర్నర్ శక్తికాంత దాస్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
7.8% నుంచి తగ్గుతూ..
నిజానికి మొదట్లో ఈసారి దేశ జీడీపీ 7.8 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. అయితే మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఏప్రిల్లో దాన్ని 7.2 శాతానికి తగ్గించింది. ఇప్పుడు మరింత దించింది. ‘భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం, దాదాపు అన్ని దేశాల సెంట్రల్ బ్యాంకులు కీలక వడ్డీరేట్లను పెంచడం, డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ పడిపోయి దేశ ఫారెక్స్ నిల్వలు వేగంగా దిగజారుతుండటం.. భారత వృద్ధిరేటు ప్రగతికి ఉన్న అవకాశాల్ని దెబ్బతీస్తున్నాయి’ అని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. కాగా, ఈ జూలై-సెప్టెంబర్లో 6.3 శాతంగా, అక్టోబర్-డిసెంబర్, జనవరి-మార్చి త్రైమాసికాల్లో 4.6 శాతం చొప్పున జీడీపీ నమోదయ్యే వీలుందని దాస్ అంచనా వేశారు. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం (2023-24) ఏప్రిల్-జూన్లో వృద్ధిరేటు 7.2 శాతంగా ఉండొచ్చన్నారు. కరోనా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థల్ని ప్రభావితం చేశాయన్నారు.
పండగ సీజన్తో జోష్
రెండున్నరేండ్లుగా కరోనాతోనే కలిసి జీవిస్తున్నామని, అనేక ఆంక్షల మధ్య బతకాల్సి వస్తున్నదని ఈ సందర్భంగా దాస్ ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు. అయితే మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో రాబోయే పండుగ సీజన్.. మార్కెట్లో కొత్త ఉత్సాహాన్ని నింపగలదన్న ఆశాభావాన్ని కనబర్చారు. నగరాలు, పట్టణాల్లో కొనుగోళ్లు పెరగడం శుభపరిణామమన్నారు. గ్రామాల్లోనూ క్రమేణా వినియోగదారుల కొనుగోలు శక్తి పెరుగుతున్నదని చెప్పారు.
టోకనైజేషన్కు సిద్ధం
ఇప్పటిదాకా దాదాపు 35 కోట్ల క్రెడిట్/డెబిట్ కార్డుల టోకనైజేషన్ జరిగిందని, శనివారం నుంచి కొత్త నిబంధనల అమలుకు సర్వం సిద్ధమని ఆర్బీఐ స్పష్టం చేసింది. వినియోగదారుల భద్రత దృష్ట్యా అక్టోబర్ 1 నుంచి కార్డుల టోకనైజేషన్ను ఆర్బీఐ తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. టోకనైజేషన్లో భాగంగా క్రెడిట్/డెబిట్ కార్డు వివరాలన్నీ ‘టోకెన్’గా పిలవబడే ఓ ప్రత్యామ్నాయ కోడ్తో రీప్లేస్ అవుతాయి. ఫలితంగా వ్యాపారుల వద్ద కస్టమర్ల కార్డు వివరాలేవీ ఇక నిల్వ ఉండవు. ఆగస్టు ఆఖరు నాటికి దేశంలో 101 కోట్లకుపైగా క్రెడిట్/డెబిట్ కార్డులున్నాయి.
చట్టాలకు లోబడి చేసుకోండి
బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు తమ రుణాల వసూళ్ల కోసం ఔట్సోర్సింగ్కు వెళ్లడాన్ని తాము వ్యతిరేకించడం లేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. అయితే చట్టానికి లోబడి ఈ ప్రక్రియ సాగాలనే తాము కోరుకుంటున్నట్టు చెప్పారు. జార్ఖండ్లో ఓ గర్భిణి మరణానికి మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ కుదుర్చుకున్న థర్డ్పార్టీ లోన్ రికవరీ ఏజెంట్లు కారణమైన నేపథ్యంలో సదరు సంస్థపై ఆర్బీఐ చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ విషయంలో దాస్ స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు.
క్యాడ్ 3 శాతంలోపే
ఈ ఆర్థిక సంవత్సరం (2022-23) దేశ జీడీపీలో కరెంట్ ఖాతా లోటు (క్యాడ్) 3 శాతంలోపే ఉండొచ్చని ఆర్బీఐ అంచనా వేసింది. నిజానికి ప్రథమార్ధం (ఏప్రిల్-సెప్టెంబర్) క్యాడ్ పెరుగుతూ వచ్చిందని, ద్వితీయార్ధంలో తగ్గే వీలున్నదని చెప్పింది. కాగా, తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్) జీడీపీలో క్యాడ్ 2.8 శాతంగా ఉన్నదని ఆర్బీఐ గురువారమే ప్రకటించిన విషయం తెలిసిందే. గత ఆర్థిక సంవత్సరం (2021-22) జీడీపీలో క్యాడ్ 1.2 శాతంగా ఉన్నది. దేశ ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఉంటే కరెంట్ ఖాతా లోటుకు దారితీస్తుంది.
ఆర్బీఐ ద్రవ్యసమీక్ష ముఖ్యాంశాలు
‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఓ భీకర తుపాను కనుసన్నల్లో ఉన్నది. ఏ క్షణంలో ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో చెప్పలేం. కరోనా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత వస్తున్న మరో పెను సంక్షోభమే ఇది. ఇక ద్రవ్య విధాన నిర్ణయాలకు రూపాయి తీరుతెన్నులు కారణం కావు. కీలక వడ్డీరేట్లను సవరించేటప్పుడు ద్రవ్య విధాన కమిటీ అనేకానేక అంశాలను పరిగణనలోకి తీసుకొని నిర్ణయాన్ని ప్రకటిస్తుంది. ఇందులో ద్రవ్యోల్బణం, వృద్ధిరేటు తదితర అంశాలు ప్రధానంగా నిలుస్తాయి. ఈ ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య రూపాయి మారకం విలువ 7.4 శాతమే క్షీణించింది. రూపాయి కోసం ఆర్బీఐ వద్ద ఎటువంటి ఫిక్స్డ్ ఎక్సేంజ్ రేటు లేదు. అలాగే ద్రవ్యోల్బణ లక్ష్యసాధనలో వైఫల్యానికి సంబంధించిన కారణాలను ప్రభుత్వానికే చెప్తాం. అవి బయటకు చెప్పేవి కావు.’
-శక్తికాంత దాస్, ఆర్బీఐ గవర్నర్
ద్రవ్యోల్బణం అంచనా 6.7%
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2022-23)గాను ద్రవ్యోల్బణ అంచనాను ఆర్బీఐ యథాతథంగానే ఉంచింది. ఈసారి 6.7 శాతంగా ఉండొచ్చన్న క్రితం అంచనానే మరోసారి వ్యక్తపర్చింది. ఆర్బీఐ రిటైల్ ద్రవ్యోల్బణ ఆమోదయోగ్య స్థాయి 2-6 శాతమే. అయితే ఈ ఏడాది జనవరి నుంచి అంతకుమించే నమోదవుతున్నది. ఏప్రిల్, మే, జూన్, ఆగస్టుల్లో 7 శాతాన్ని తాకింది. డిసెంబర్దాకా ఇంతేనన్న అభిప్రాయాన్నీ వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే రెపోరేటును పెంచుతున్నది తెలిసిందే. అయితే వచ్చే ఏడాది జనవరి నుంచి ద్రవ్యోల్బణం తగ్గొచ్చని అంచనా వేసింది.
8 వారాల నుంచి తగ్గుతూనే..
ఈ ఏడాది ఏప్రిల్ నుంచి దేశంలోని విదేశీ మారకపు నిల్వల్లో విలువ మార్పుతోనే 67 శాతం క్షీణత చోటుచేసుకున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. రీవాల్యుయేషన్, డాలర్ విలువ పెరగడం, అధిక అమెరికా బాండ్ ఈల్డ్లే కారణమన్నారు. ఏప్రిల్ 2న భారత ఫారెక్స్ రిజర్వులు 606.475 బిలియన్ డాలర్లుగా ఉన్నాయని, సెప్టెంబర్ 23న 537.5 బిలియన్ డాలర్లకు దిగివచ్చాయని చెప్పారు. వరుసగా 8 వారాల నుంచి ఫారెక్స్ నిల్వలు పడిపోతూనే ఉన్నాయని తెలియజేశారు. ఏప్రిల్-సెప్టెంబర్లో రూపాయి మారకంతో పోల్చితే డాలర్ విలువ 14.5 శాతం ఎగిసింది.
ద్వైపాక్షిక వాణిజ్యంలో రూపాయి
రూపాయల్లో ద్వైపాక్షిక వాణిజ్యం జరిపేందుకు నాలుగైదు దేశాలు, చాలా బ్యాంకుల నుంచి సుముఖత వ్యక్తమైనట్టు ఆర్బీఐ గవర్నర్ దాస్ తెలిపారు. డాలర్ విలువ పెరుగుతూపోతున్న నేపథ్యంలో రూపాయి అంతర్జాతీయీకరణలో భాగంగా తీసుకుంటున్న చర్యలు ఫలిస్తున్నట్టు చెప్పారు. అంతర్జాతీయ వాణిజ్యంలో రూపాయి వినియోగానికి వీలుగా ఈ ఏడాది జూలై 11న ఆర్బీఐ మార్గదర్శకాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా, రూపాయి లావాదేవీలతో ఫారెక్స్ రిజర్వులపై భారం తగ్గుతుందని రిజర్వ్ బ్యాంక్ గట్టిగా విశ్వసిస్తున్నది.