Kotak Mahindra Bank | కోటక్ మహీంద్రా బ్యాంక్ నూతన ఎండీ కం సీఈఓగా అశోక్ వాశ్వానీ నియమితులయ్యారని బ్యాంకు శనివారం ప్రకటించింది. ఈ బ్యాంక్ వ్యవస్థాపక ఎండీ కం సీఈఓగా ఉదయ్ కొటక్ ఇటీవల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అశోక్ వాశ్వానీ నియామకానికి ఆర్బీఐ ఆమోదం తెలిపింది.
ప్రస్తుతం అశోక్ వాశ్వానీ.. అమెరికా-ఇజ్రాయెల్ ఫిన్ టెక్ సంస్థ పగయా టెక్నాలజీస్ అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. ఇంతకుముందు సిటీ గ్రూప్, బార్ క్లేస్ బ్యాంకు సహా పలు ఆర్థిక సంస్థల్లో పని చేశారు. డిజిటల్ బ్యాంకింగ్, కన్జూమర్ ఫోకస్ పై సుదీర్ఘమైన అనుభవం కలిగి ఉన్నారు. మూడేండ్ల పాటు కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎండీ కం సీఈఓగా అశోక్ వాశ్వానీ కొనసాగుతారని ఆర్బీఐ తెలిపింది. 2024 జనవరి ఒకటో తేదీలోగా బాధ్యతలు స్వీకరిస్తారు.
ఉదయ్ కోటక్ రాజీనామా తర్వాత బ్యాంకులో పని చేస్తున్న వారికే ప్రమోషన్ కల్పిస్తారని వదంతులు వచ్చాయి. ఉదయ్ కోటక్ వారసులుగా బ్యాంకులోనే పని చేస్తున్న కేవీఎస్ మనియన్, శాంతి ఏకాంబరం ఎంపికవుతారని అంతా భావించారు. మనియన్, ఏకాంబరం బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా ఉన్నారు. దీనిపై ప్రస్తుత బ్యాంక్ తాత్కాలిక ఎండీ కం సీఈఓ దీపక్ గుప్తా స్పందిస్తూ.. అశోక్ వాశ్వానీ నియామకానికి బ్యాంకు బోర్డు, ఆర్బీఐ ఆమోదం తెలిపాయని చెప్పారు. ఉదయ్ కోటక్ ఇక కోటక్ మహీంద్రా బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కొనసాగుతారు.