ముంబై, జనవరి 3: ఖాతాదారులు ఇక నుంచి ఇంటర్నెట్, టెలిఫోన్ కనెక్టివిటీ లేకపోయినా డిజిటల్ చెల్లింపులు చేయవచ్చు. గ్రామీణ, చిన్న పట్టణ ప్రాంతాల్లో డిజిటల్ లావాదేవీలను పెంచే క్రమంలో ఆఫ్లైన్ ద్వారా చెల్లింపులకు రిజర్వ్బ్యాంక్ సోమవారం సమ్మతి తెలిపింది. ఈ పద్ధతిలో రూ.200 వరకూ ఒక్కో లావాదేవీ జరుపుకోవచ్చని పేర్కొంటూ ఈ రకంగా జరిగే మొత్తం లావాదేవీలకు రూ.2,000 రోజువారీ పరిమితిని విధించింది. సాధనం ద్వారా వాడిన మొత్తాన్ని ఏఎఫ్ఏతో ఆన్లైన్లోనే భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇటువంటి లావాదేవీలకు ఓటీపీలు, పిన్లు, ఎస్ఎమ్మెస్ల వంటి అడిషనల్ ఫ్యాక్టర్ అథంటికేషన్ (ఏఎఫ్ఏ) అవసరం లేదని ఆర్బీఐ తెలిపింది. ఇవి ఆఫ్లైన్లో జరగనున్నందున, ఎస్ఎమ్మెస్/ ఈ-మెయిల్ అలర్ట్లు ఖాతాదారుకు ఆలస్యంగా అందుతాయని కేంద్ర బ్యాంక్ వివరించింది. ఇంటర్నెట్ సదుపాయం లేని ప్రాంతాల్లోనూ, టెలిఫోన్ కనెక్టివిటీ అందుబాటులో లేని ప్రాంతాల్లో డిజిటల్ లావాదేవీలు సజావుగా జరిగేందుకు, స్మార్ట్ఫోన్లు లేనివారు కూడా డిజిటల్ చెల్లింపులు చేసేందుకు ఈ ఆఫ్లైన్ ప్రక్రియ ఉపకరిస్తుందని పరిశ్రమ నిపుణులు చెప్తున్నారు.
జరిగేదిలా…
ఆర్బీఐ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ లావాదేవీలు కార్డ్లు, వ్యాలెట్లు, మొబైల్ఫోన్ హ్యాండ్సెట్లు వంటి సాధనాల ద్వారా ఫేస్-టూ-ఫేస్ మోడ్లో జరుగుతాయి. ప్రస్తుతం స్మార్ట్ఫోన్ల ద్వారా ఇంటర్నెట్ ఉపయోగించి డిజి టల్ చెల్లింపులు చేస్తుండగా, ఈ పద్ధతిలో ఖాతాదారు తన వద్దనున్న బ్యాంక్ కార్డ్ చిప్ లేదా తాను ఇందుకోసం తీసుకున్న ప్రీ-లోడెడ్ క్యాష్ కార్డ్ ద్వారా డిజిటల్గా చెల్లించవచ్చు. ఫోన్ హ్యాండ్సెట్లోని సిమ్తో కూడా చెల్లింపులు జరిపే సౌలభ్యాన్ని, వాయిస్ ద్వారా లావాదేవీ పూర్తిచేసే సదుపాయాన్ని కూడా అభివృద్ధిపర్చారు. ఇందుకోసం ఉపయోగించే సాధనాల్ని ఆఫ్లైన్ లావాదేవీలకు ఎనేబుల్ చేసేందుకు ఈ సర్వీసుల్ని అందించే సంస్థ ఖాతాదారు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.