ముంబై, మే 30: ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం (2022-23) దేశీయంగా చలామణిలో కరెన్సీ విలువ, నోట్ల సంఖ్య రెండూ పెరిగాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మంగళవారం విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం 2022-23లో చలామణిలో ఉన్న కరెన్సీ విలువ 7.8 శాతం, నోట్ల సంఖ్య 4.4 శాతం ఎగబాకాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2021-22) కరెన్సీ విలువ 9.9 శాతం, నోట్ల సంఖ్య 5 శాతం పెరిగినట్టు ఆర్బీఐ తమ రిపోర్టులో పేర్కొన్నది. ఇక రూ.2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్టు ఆర్బీఐ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది సెప్టెంబర్ 30లోగా వాటిని ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో, బ్యాంకుల్లో మార్చుకోవచ్చని సూచించిన సంగతీ విదితమే. ఈ క్రమంలో ఈ ఏడాది మార్చి చివరి నాటికి చలామణిలో ఉన్న రూ.2000 నోట్ల సంఖ్య 1.3 శాతం, విలువ 10.8 శాతం పడిపోయిందని ఆర్బీఐ ఈ సందర్భంగా తెలియజేసింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలోనూ నోట్లు 1.6 శాతం, విలువ 13.8 శాతం తగ్గిందన్నది. కాగా, 2021-22తో పోల్చితే 2022-23లో నోట్ల ఇండెంట్, సైప్లె 1.6 శాతం పెరిగింది. బీఆర్బీఎన్ఎంపీఎల్ ద్వారా 2,26,000 లక్షల నోట్లు, ఎస్పీఎంసీఐఎల్ ద్వారా 2,26,002 లక్షల నోట్ల ఇండెంట్, సైప్లె జరిగింది.
గత ఆర్థిక సంవత్సరంలోనూ బ్యాంకింగ్ రంగంలో నకిలీ నోట్లు కలకలం సృష్టించాయి. గుర్తించిన మొత్తం నకిలీ నోట్లలో ఆర్బీఐ వద్ద 4.6 శాతం బయటపడగా, బ్యాంకుల్లో 95.4 శాతం దొరికాయని తాజా రిపోర్టులో తేలింది. ఇక అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చితే గత ఆర్థిక సంవత్సరం కొత్త డిజైన్ రూ.20, 500 నోట్లలో నకిలీ నోట్లు వరుసగా 8.4 శాతం, 14.4 శాతం చొప్పున పెరగడం గమనార్హం. అయితే రూ.10, 100, 2000 నకిలీ నోట్లు వరుసగా 11.6 శాతం, 14.7 శాతం, 27.9 శాతం మేరకు తగ్గాయని ఆర్బీఐ ప్రకటించింది.
ఈ ఆర్థిక సంవత్సరంలోనూ దేశం వృద్ధిపథంలోనూ నడుస్తుందన్న ధీమాను ఆర్బీఐ వ్యక్తం చేసింది. అయితే నెమ్మదిస్తున్న ప్రపంచ ఆర్థిక వృద్ధి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక మార్కెట్లలో మరింతగా ఒడిదుడుకులు ఏర్పడే వీలుండటం వంటివి నిర్మాణాత్మక సంస్కరణలపై ఒత్తిడిని పెంచుతున్నట్టు చెప్పింది. ఈ ప్రతికూల పరిస్థితులతో దేశ జీడీపీ వృద్ధిరేటు తగ్గవచ్చన్న ఆందోళననూ వెలిబుచ్చింది. గత ఆర్థిక సంవత్సరం దేశ జీడీపీ 7 శాతంగా నమోదు కాగలదన్న అంచనాను కనబర్చింది.
గత ఆర్థిక సంవత్సరం ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ పరిమాణం 2.5 శాతం పెరిగింది. రూ.63.45 లక్షల కోట్లకు చేరింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం వరకు రూ.61.9 లక్షల కోట్లుగానే ఉన్నది. కాగా, 2022-23లో ఆర్బీఐ ఆదాయం 47.06 శాతం, వ్యయం 14.05 శాతం ఎగిశాయి. ఈ ఏడాది మార్చి 31 నాటికి ఆర్బీఐ వద్ద ఉన్న బంగారం నిల్వలు 794.63 మెట్రిక్ టన్నులు. నిరుడు మార్చి ఆఖర్లో 760.42 మెట్రిక్ టన్నులే. ఇదిలావుంటే విపత్తు సమయాల్లో క్లిష్టతరమైన లావాదేవీల కోసం లైట్ వెయిట్, పోర్టబుల్ పేమెంట్ వ్యవస్థల పరిచయానికి పనిచేస్తున్నట్టు ఆర్బీఐ తెలిపింది. మరోవైపు సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) విస్తరణపైనా దృష్టి పెట్టినట్టు వెల్లడించింది. ఇదిలావుంటే ఈ ఆర్థిక సంవత్సరం బ్యాడ్ లోన్ ప్రొవిజనింగ్ కోసం ఓ సమర్థవంతమైన విధానాన్ని అందుబాటులోకి తెస్తామన్న ఆశాభావాన్ని ఆర్బీఐ వెలిబుచ్చింది.