ముంబై, ఏప్రిల్ 2: ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) తొలి ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షను బుధవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రారంభిస్తున్నది. మూడు రోజులపాటు జరిగే ఈ సమావేశం నిర్ణయాలు శుక్రవారం వెలువడనున్నాయి. కాగా, ఈసారీ కీలక వడ్డీరేట్ల జోలికి వెళ్లకుండానే ఆర్బీఐ తమ ద్రవ్య విధానాన్ని ప్రకటించవచ్చన్న అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి.
కరోనా సమయంలో దిగాలు పడిన దేశ ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపర్చేందుకు ఆర్బీఐ రెపోరేటును భారీగా తగ్గించిన విషయం తెలిసిందే. అయితే కోవిడ్ ప్రభావం తగ్గుముఖం పట్టడంతో ద్రవ్యోల్బణం అదుపే లక్ష్యంగా రెపోరేటును పెంచుకుంటూ పోయింది. ఫలితంగా ఇప్పుడిది 6.5 శాతంగా ఉన్నది. నిజానికి నిరుడు మే నెల నుంచి ఇది ఇలాగే ఉంటున్నది. ఈ క్రమంలో ఈసారి ద్రవ్య సమీక్షలోనూ ఈ రేటు ఇక్కడే ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ద్రవ్యోల్బణం ఇంకా ఆర్బీఐ ఆమోదయోగ్య స్థాయిలోకి దిగి రాకపోవడం, ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల విధానం వంటివి ఇందుకు కారణంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇదిలావుంటే గతంలో మూడు నెలలకోసారి నిర్వహించిన ద్రవ్య సమీక్షను.. ఇప్పుడు రెండు నెలలకే చేపడుతున్నారు. దీంతో ప్రతీ ఆర్థిక సంవత్సరంలో 6 సమీక్షలు జరుగుతున్నాయి. సాధారణంగా ఏప్రిల్, జూన్, ఆగస్టు, అక్టోబర్, డిసెంబర్, ఫిబ్రవరి నెలల్లో ఇవి ఉంటాయి. వడ్డీరేట్లు, నగదు చలామణి, ద్రవ్యోల్బణం, ఇతర స్థూల ఆర్థికాంశాలపై ఈ సమావేశాల్లో ఆర్బీఐ గవర్నర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ చర్చిస్తుంది. మెజారిటీ సభ్యుల అంగీకారంతో నిర్ణయాలు వెలువడుతాయి.