RBI |ముంబై, ఆగస్టు 18: జరిమానా వడ్డీల్ని విధించరాదని బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. ఈ మేరకున్న నిబంధనల్ని సవరించింది. శుక్రవారం మార్చిన ఆ నిబంధనల్ని ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. జరిమానా వడ్డీల్ని ఆదాయాన్ని పెంచుకునే సాధనాలుగా బ్యాంకర్లు, ఎన్బీఎఫ్సీలు చూస్తున్నారంటూ ఆర్బీఐ ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ప్రస్తుతమున్న నిబంధనల్ని మార్చేసింది. అయినప్పటికీ రుణగ్రహీతలు తాము తీసుకున్న రుణాల చెల్లింపుల్లో విఫలమైతే జరిమానా చార్జీలు వేయవచ్చన్నది.
అయితే అవి సహేతుకంగా ఉండాలని తాజా నోటిఫికేషన్లో ఆర్బీఐ స్పష్టం చేసింది. ‘ఫెయిర్ లెండింగ్ ప్రాక్టీస్, పీనల్ చార్జెస్ ఇన్ లోన్ అకౌంట్స్’ పేరిట ఈ నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో రుణగ్రహీతలకు ఊరట లభించినైట్టెంది. ‘రుణ ఒప్పందం ప్రకారం రుణగ్రహీత.. నియమ, నిబంధనలకు అనుగుణంగా నడుచుకోనైట్టెతే అవసరమనుకుంటే రుణదాతలు వారిపై ‘జరిమానా చార్జీ’లు వేసుకోవచ్చు. కానీ జరిమానా వడ్డీలను వేయరాదు. వీటివల్ల వడ్డీరేటు పెరిగి భవిష్యత్తులో చెల్లించబోయే కిస్తీ (నెలవారీ చెల్లింపులు లేదా ఈఎంఐ)లపైనా భారం పడుతుంది’ అని నోటిఫికేషన్లో ఆర్బీఐ వివరించింది. అలాగే జరిమానా చార్జీలపై మళ్లీమళ్లీ ఎటువంటి వడ్డీలను వేయరాదని కూడా తేల్చిచెప్పింది.
ఆర్బీఐ సవరించిన నిబంధనలు.. క్రెడిట్ కార్డులు, విదేశీ వాణిజ్య రుణాలు, వాణిజ్య రుణాలకు వర్తించబోవు. ఇవన్నీ కూడా ప్రోడక్ట్ స్పెసిఫిక్ డైరెక్షన్స్ కిందకు వస్తాయని ఆర్బీఐ ఈ సందర్భంగా తెలియజేసింది. కాగా, రుణ చెల్లింపుల్లో ఆలస్యమైతే చాలా బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు జరిమానా వడ్డీలకు దిగుతున్నాయని ఆర్బీఐ దృష్టికి వచ్చింది. ఈ మేరకు ఫిర్యాదులు కూడా పెద్ద ఎత్తున వస్తుండటంతో తాజా సవరణల్ని చేసింది. జరిమానాలు రుణగ్రహీతల్లో క్రమశిక్షణ కోసమేగానీ, రుణదాతల ఆదాయ వనరుగా ఉండరాదని పేర్కొన్నది.
లోన్ ఈఎంఐలు ఆలస్యమైతే మీ క్రెడిట్ స్కోరే కాదు.. జరిమానాలూ ఉంటాయి. ఈ జరిమానాలు.. జరిమానా వడ్డీల రూపంలో పడుతాయి. ఇవి అధిక వడ్డీతో ఉంటాయి. ఆలస్యమైన ఒక్కో ఈఎంఐకి ఈ రేటుతోనే లేట్ పేమెంట్ ఫీజును చెల్లించాలి. ఉదాహరణకు బ్యాంక్ జరిమానా వడ్డీ 24 శాతంగా ఉంటే.. మీపై జరిమానా 2 శాతంగా ఉంటుంది. మీ ఈఎంఐ రూ.50 వేలుగా ఉంటే, అది ఆలస్యమైతే మరో రూ.1,000 కట్టాలి. దీనిపై జీఎస్టీ రూ.118 అదనం.
ఈఎంఐల ద్వారా రుణాలను చెల్లించే వ్యక్తిగత రుణగ్రహీతలకు వడ్డీరేట్లను సవరిస్తున్నప్పుడు ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ విధానంలోకి మారడానికి లేదా రుణ కాలపరిమితిని పెంచుకోవడానికి అవకాశం ఇవ్వాలని బ్యాంకులకు ఆర్బీఐ శుక్రవారం సూచించింది. వడ్డీరేట్లు క్రమేణా పెరుగుతూపోతున్న నేపథ్యంలో ఇటీవలి ద్రవ్యసమీక్ష సందర్భంగా ఆర్బీఐ ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చిన విషయం తెలిసిందే. దాన్నిప్పుడు బ్యాంకులు, ఇతర రుణదాతలకు చేరవేసింది. వడ్డీరేట్లను సవరిస్తున్నప్పుడు రుణగ్రహీతలకు ఆ సమాచారాన్ని తప్పక తెలియజేయాలని కూడా స్పష్టం చేసింది. గత ఏడాది మే నెల నుంచి ఆర్బీఐ రెపోరేటును వరుసగా పెంచుతూపోయిన సంగతి విదితమే. ఫలితంగా వడ్డీరేట్లు 2.5 శాతం పెరిగాయి. ఇప్పుడున్న రుణాల్లో చాలావరకు ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ విధానంలోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆర్బీఐ రెపోరేటుకు అనుసంధానమై ఉంటాయి. రెపోరేటు పెరిగినప్పుడు పెరగడం, తగ్గినప్పుడు తగ్గడం జరుగుతూ ఉంటుంది. ఇలాకాకుండా రుణం తీసుకున్నప్పుడు రుణగ్రహీత సిబిల్ స్కోర్ ఆధారంగా రుణదాతలు నిర్ణయించే వడ్డీరేటు.. రుణం మొత్తం తీర్చేదాకా వర్తించేలా ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ విధానం ఉంటుంది. దాన్నే ఇప్పుడు రుణగ్రహీతలు కోరుకుంటే అనుమతించాలని ఆర్బీఐ బ్యాంకర్లకు చెప్తున్నది.