RBI Bonds | రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని చాలా మంది వారి ఆదాయంలో ఆదా చేసుకున్న సొమ్మును భద్రంగా ఉంటుంది..కొంత వడ్డీ వస్తుందన్న ఆలోచనతో బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు, పోస్టాఫీసు పత్రాల్లో మదుపు చేస్తుంటారు. కానీ వీటికంటే అధిక వడ్డీనిచ్చే నూరుశాతం సురక్షితమైన సాధనాల్ని (కొన్ని బ్యాంక్ల డిపాజిట్లకు కొంత రిస్క్ ఉంటుంది) స్వయంగా రిజర్వ్బ్యాంకే జారీచేస్తుందన్న సంగతి చాలామందికి తెలియదు. అవే ఆర్బీఐ ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్స్. వీటికి భారత ప్రభుత్వం పూర్తి గ్యారంటీ ఉన్నది. అంటే ఇందులో మదుపుచేసే అసలు మొత్తం, వడ్డీ నూరు శాతం సురక్షితమన్న మాట. ఎస్బీఐ, జాతీయ బ్యాంక్ల శాఖల్లోనూ, మూడు ప్రైవేటు బ్యాంక్ శాఖల్లోనూ వీటికి దరఖాస్తు చేయవచ్చు. అలాగే ఆన్లైన్లో అయితే ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ పోర్టల్ ద్వారా తీసుకోవచ్చు.
మన దేశంలో నివసించేవారు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్యూఎఫ్లు) ఆర్బీఐ ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్లలో పెట్టుబడి చేయవచ్చు. మైనరు తరపున తండ్రి, తల్లి, చట్టబద్ద గార్టియన్ మదుపు చేయవచ్చు. ఒకరు లేదా అంతకంటే ఎక్కువమందిని నామినేట్ చేసుకునే సౌలభ్యం ఉంది. ఈ బాండ్లలో ఇన్వెస్ట్ చేయడానికి ప్రవాస భారతీయులు అనర్హులు.
పోస్టాఫీసులో లభించే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్సీ)పై ఇచ్చే రేటుకు 35 బేసిస్ పాయింట్లు అదనంగా (0.35 శాతం)ఈ బాండ్లపై వడ్డీ రేటును నిర్ణయిస్తారు. ప్రతీ ఆరు నెలలకూ అప్పటి ఎన్ఎస్సీ రేటుకు అనుగుణంగా ఈ బాండ్పై సైతం రేటు మారుతుంది. ప్రస్తుతం ఎన్ఎస్సీకి అమల్లో ఉన్న వడ్డీ రేటు 7.7 శాతం. దానికి తగ్గట్టు 0.35 శాతం పెంపుదలతో ఆర్బీఐ ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్స్పై 8.05 శాతం వడ్డీ రేటుతో లభిస్తుంది. అదే ప్రభుత్వ రంగ ఎస్బీఐ ఆఫర్ చేసే 5 నుంచి 10 ఏండ్ల డిపాజిట్పై 7.5 శాతం వడ్డీ రేటు ఉన్నది.
ఆర్బీఐ ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్ కాలపరిమితి జారీ అయిన తేదీ నుంచి ఏడేండ్లు ఉంటుంది. 60 ఏండ్లు దాటినవారు ఏడేండ్లకంటే ముందుగానే బాండ్ను తిరిగి ఇచ్చి తాము ఆదా చేసిన సొమ్ము తీసుకోవచ్చు. 60-70 ఏండ్లవారు ఆరేండ్లు, 70-80 ఏండ్లవారు ఐదేండ్లు, 80పైబడినవారు నాలుగేండ్ల తర్వాత ముందస్తుగా రిడీమ్ చేసుకోవచ్చు.
ఆర్బీఐ ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్లను కనీసం రూ.1000 ముఖ విలువతో జారీచేస్తారు. వీటిలో గరిష్ఠ పెట్టుబడికి ఎటువంటి పరిమితీ లేదు. ఎన్ని బాండ్లనైనా తీసుకోవచ్చు.
ఈ బాండ్ల మీద వచ్చే వడ్డీ ఆదాయంపై పన్ను ఉంటుంది. వడ్డీ చెల్లింపు సమయంలో ప్రస్తుత ఐటీ నిబంధనల ప్రకారం 10 శాతం టీడీఎస్ను మినహాయిస్తారు. ఒక సంవత్సరంలో రూ.40,000 లోపు వడ్డీ ఆదాయంపై టీడీఎస్ ఉండదు. అలాగే సీనియర్ సిటిజన్లకు రూ.50,000 లోపు వడ్డీ ఆదాయంపై టీడీఎస్ మినహాయించరు. ఈ బాండ్లకు సంపద పన్ను మాత్రం ఉండదు.