బోర్డుకు రాజీనామా, వాటా తగ్గించుకుంటానంటూ ప్రకటన
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: ఇండిగో ఎయిర్లైన్స్ వ్యవస్థాపకుల్లో ఒకరైన రాకేష్ గంగ్వాల్ సంస్థ నుంచి వైదొలగడానికి నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఆయన శుక్రవారం ఇండిగో ఎయిర్లైన్స్ మాతృసంస్థ ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. సంస్థలో తనకున్న వాటాను వచ్చే ఐదేండ్లలో క్రమేపీ తగ్గించుకుంటానని ప్రకటించారు. 2006లో గంగ్వాల్, రాహుల్ భాటియాలు నెలకొల్పిన ఇంటర్గ్లోబ్ ఏవియేషన్లో గంగ్వాల్, సంబంధీకులకు 36.6 శాతం వాటా, భాటియా, సంబంధీకులకు 38 శాతం వాటా ఉంది. కంపెనీలో తాను 15 ఏండ్లకుపైగా షేర్హోల్డరుగా ఉన్నానని, ఏదో ఒకరోజు వాటాను మళ్లించుకోవడం సహజమేనని బోర్డు సభ్యులకు రాసిన లేఖలో గంగ్వాల్ పేర్కొన్నారు. వచ్చే ఐదేండ్లలో తన వాటాను క్రమేపీ తగ్గించుకోవాలని ప్రస్తుతం భావిస్తున్నానని లేఖలో తెలిపారు. అయితే భవిష్యత్తులో తిరిగి బోర్డులోకి రావొచ్చని సూచనప్రాయంగా వెల్లడించారు. ఇక సహ వ్యవస్థాపకుడిగా, సహ ప్రమోటర్గా, డైరెక్టర్గా తనకు కంపెనీ షేరు ధరను ప్రభావితం చేసే సమాచారాన్ని సంస్థ పంపిస్తూ ఉన్నదని, అటువంటి సమాచారం కలిగిఉండటం తన వాటా విక్రయానికి ఆటంకం కలుగుతుందన్న ఆందోళన ఉన్నదని, అందుచేత డైరెక్టర్గా వైదొలిగిన తనకు ఇకపై ఆ సమాచారాన్ని పంపవద్దని బోర్డును కోరారు.