న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: వడ్డీరేట్ల పెంపు జాతి వ్యతిరేక చర్యేమీ కాదని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి ద్రవ్యపరపతి విధాన సమీక్షలో భాగంగానే ఆర్బీఐకీలక వడ్డీరేట్లను పెంచుతుందని చెప్పారు. కాబట్టి రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ వడ్డీరేట్ల పెంపును జాతి వ్యతిరేక కార్యకలాపాల్లో ఒకటిగా చూడవద్దని సూచించారు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరుగుతున్న వేళ.. ఆర్బీఐ నుంచి వడ్డీరేట్ల పెంపు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే లింకెడిన్పై తాజాగా పెట్టిన ఓ పోస్టు ద్వారా రాజన్ పైవిధంగా స్పందించారు.
ఒక రకంగా ఆర్బీఐ వడ్డీరేట్ల పెంపు కూడా దేశ ఆర్థిక సుస్థిరతకు పెట్టుబడేనని అభివర్ణించారు. జీడీపీ బలోపేతానికి, దేశంలోని విదేశీ మారకపు నిల్వల పెంపునకు, దేశ పౌరుల ప్రయోజనాలకు పెద్దపీట వేసేందుకు ఆర్బీఐ చర్యలు ఉపకరిస్తాయని స్పష్టం చేశారు. ద్రవ్యోల్బణంపై పోరు ఎప్పటికీ ఆగిపోదన్న ఆయన.. గతాన్ని ఆర్బీఐకి గుర్తుచేయడంలో ఈ యుద్ధం దోహదం చేస్తుందనీ అన్నారు. ద్రవ్యోల్బణం విజృంభిస్తుండటంతో రాబోయే ద్రవ్యసమీక్షల్లో కీలక వడ్డీరేట్ల పెంపు ఉంటుందన్న సంకేతాలను రిజర్వ్ బ్యాంక్ ఇస్తున్నదిప్పుడు. ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరానికిగాను ద్రవ్యోల్బణ అంచనాను 4.5 శాతం నుంచి 5.7 శాతానికి పెంచింది కూడా. ఇదే సమయంలో వృద్ధిరేటు అంచనానూ 7.8 శాతం నుంచి 7.2 శాతానికి తగ్గించింది.