Railway Journey | బస్సులు, ఆటోలతో పోలిస్తే రైలు ప్రయాణం సేఫ్.. ఖర్చు తక్కువ. టైం కూడా కలిసి వస్తుంది. సమీప పట్టణాలు, నగరాల్లో విద్యాభ్యాసం చేసే విద్యార్థులు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పని చేసేవారు, చిన్న చిన్న వ్యాపారులు సైతం రైలు ప్రయాణం ద్వారా తమ నిర్దేశిత ప్రాంతానికి వెళ్లడానికి ప్రాధాన్యం ఇస్తుంటారు. ఇలా ప్రతి రోజూ రైలులో వెళ్లేవారు జనరల్ బోగీల్లోనే ప్రయాణం చేస్తారు. జనరల్ బోగీల్లో ప్రయాణానికి రైలు రావడానికి ముందు టికెట్లు ఇస్తారు. ఒక్కోసారి టికెట్ బుకింగ్ సెంటర్ దగ్గర జనం రద్దీ ఉంటే టికెట్ కొనుక్కోవడం కష్ట సాధ్యంగా మారుతూ ఉంటుంది.
అయినా ఇప్పుడు అంతా స్మార్ట్ ఫోన్.. అందులో యాప్లతో మనకు అవసరమైన పనులు పూర్తి చేసుకునే వెసులుబాటు ఉంది. రోజూ ప్రయాణించే వారికి వెసులుబాటు కల్పించడానికి భారతీయ రైల్వేస్ తీసుకొచ్చింది యూటీఎస్ (అన్ రిజర్వుడ్ టికెట్ బుకింగ్ సిస్టమ్) యాప్.
స్మార్ట్ ఫోన్ యూజర్లు తమ ఫోన్లో గూగుల్ ప్లేస్టోర్ ద్వారా యూటీఎస్ యాప్ ఇన్స్టల్ చేసుకుంటే సరి. మీ ఫోన్లోని జీపీఎస్ ఆధారంగా ఈ `యూటీఎస్` యాప్ పని చేస్తుంది. ఇప్పటి వరకు నిర్ణీత దూరంలో ఉంటేనే ఈ యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవచ్చు. సబర్బన్ ప్రాంతాల వారు తమ పరిధిలోని రైల్వే స్టేషన్కు ఇప్పటివరకు రెండు కి.మీ. దూరంలో ఉంటే.. తాము వెళ్లే రైల్వే స్టేషన్కు ఈయాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకునే వారు. దాన్ని ఐదు కి.మీ. దూరానికి పెంచేసింది రైల్వేశాఖ.
ఇతర ప్రాంతాల్లో 20 కి.మీ. దూరం నుంచి కూడా టికెట్ బుక్ చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది రైల్వేశాఖ. పరిస్థితిని బట్టి దూరం పెంచుకోవడానికి జోన్లకు కూడా పర్మిషన్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో సబర్బన్ ప్రాంతాల్లో గరిష్టంగా 10 కి.మీ. దూరం నుంచి టికెట్ బుకింగ్కు దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) అనుమతి ఇస్తున్నది.
స్మార్ట్ ఫోన్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్లి.. యూటీఎస్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ అయ్యాక పేరు, పుట్టిన తేదీ, ఫోన్ నంబర్, పాస్వర్డ్ తదితర వివరాలు నమోదు చేశాక వచ్చే ఓటీపీ రికార్డు చేస్తే మీ ఖాతా నమోదు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఫోన్ నంబర్, పాస్వర్డ్తో లాగిన్ అయితే జనరల్ టికెట్ బుకింగ్, ప్లాట్ఫామ్ టికెట్ బుకింగ్, క్విక్ బుకింగ్, సీజనల్ బుకింగ్, క్యూఆర్ బుకింగ్, క్యానిలేషన్ తదితర ఆప్షన్లు కనిపిస్తాయి. యూటీఎస్ యాప్ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్ ఫోన్ యూజర్లు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. టికెట్ బుక్ చేశాక పేటీఎం, మొబిక్విక్, ఆర్- వ్యాలెట్, ఇంటర్నెట్ ద్వారా మనీ పే చేయొచ్చు.
జనరల్ బోగీ టికెట్ల కోసం యాప్లోని నార్మల్ బుకింగ్ ఆప్షన్ ఎంచుకోవాలి. మీరు ప్రయాణిస్తున్న రైల్వే స్టేషన్ లేదా దాని కోడ్, మీరు వెళ్లాల్సిన రైల్వే స్టేషన్ లేదా దాని కోడ్, వెళ్లే ప్రయాణికుల సంఖ్య , ప్యాసింజర్ ట్రైనా.. ఎక్స్ ప్రెస్ ట్రైనా అనే వివరాలు పేర్కొనాలి. ప్లాట్ఫామ్ టికెట్ ఆప్షన్లోకి వెళ్లి రైల్వే స్టేషన్ నంబర్, టికెట్ల సంఖ్య నమోదు చేయాలి.
కొన్ని రైల్వే స్టేషన్లలో `క్యూఆర్ కోడ్` ఏర్పాటు చేస్తున్నారు. ఇటువంటి ఫెసిలిటీ ఉన్న స్టేషన్కు వెళ్లి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి, మీరు చేరుకోవాల్సిన రైల్వే స్టేషన్ పేరు, కోడ్ ఎంటర్ చేసి.. మొత్తం ప్రయాణికుల సంఖ్య నమోదు చేస్తే టికెట్లు వచ్చేస్తాయి. పేపర్/ పేపర్లెస్ టికెట్ తీసుకునే ఆప్షన్ ఉంది.
ఈ-వాలెట్ / ఆన్లైన్లో మనీ పే చేయొచ్చు. మీరు మనీ చెల్లించాక టికెట్ బుక్ అయినట్లు మెసేజ్ వస్తుంది. యాప్ డాష్బోర్డులోకి వెళ్లి `షో టికెట్` ఆప్షన్ నొక్కితే మీ టికెట్ చూసుకోవచ్చు.