హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): ఐటీ, ఫార్మా హబ్గా కొనసాగుతున్న హైదరాబాద్ ఎలక్ట్రానిక్స్ పరికరాల ఉత్పత్తుల్లోనూ సత్తా చాటుతున్నది. హైదరాబాద్కు అత్యంత సమీపంలోని మహేశ్వరంలో ఫ్యాబ్సిటీ కేంద్రంగా దేశంలో మొట్టమొదటిసారిగా 86 అంగుళాల ఎల్ఈడీ టీవీ తయారుకానున్నది. దీనికి సంబంధించిన తయారీ అసెంబ్లీంగ్ లైన్ను ప్రముఖ రేడియంట్ అప్లియెన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ సంస్థ సోమవారం ప్రారంభించింది. ఈ అసెంబ్లింగ్ లైన్ను కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రమీందర్ సింగ్ సోయిన్ ప్రారంభించారు. దేశంలో ఏర్పాటైన అతిపెద్ద తొలి అసెంబ్లింగ్ లైన్ ఇదేనని, వచ్చే నెల రోజుల్లో ఈ టీవీ అందుబాటులోకి రానున్నట్లు చెప్పారు. ఈ అసెంబ్లింగ్ లైన్లో తయారైన టీవీని దేశీయ మార్కెట్లో విక్రయించడానికి పలు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. అలాగే 75 అంగుళాల గూగుల్ టీవీ, డీఎల్ఈడీ, బెజెల్లెస్ టీవీని మార్కెట్లోకి విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే మొట్టమొదటిసారిగా 86ఇంచుల ఎల్ఈడీ టీవీని తయారు చేయడం తమకు గర్వంగా ఉందన్నారు. దేశీయ మార్కెట్ కోసం వీటిని తయారు చేస్తున్నట్లు, నెలరోజుల్లో ఉత్పత్తి ప్రారంభమవుతుందని చెప్పారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా దేశంలో టీవీలు విక్రయిస్తున్న 14ప్రధాన అంతర్జాతీయ కంపెనీల(ఓఈఎం)కు వీటిని సరఫరా చేయనున్నట్లు తెలిపారు.