ముంబై, జనవరి 19: దేశంలో నంబర్వన్ కార్పొరేట్ కంపెనీ ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) క్యూ3 ఆర్థిక ఫలితాలు విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగా వెల్లడయ్యాయి. రిఫైనరీ మెయింటెనెన్స్ కారణంగా ఆయిల్ వ్యాపారపు రాబడులు తగ్గుతాయని, రిటైల్, టెలికం వ్యాపారాలు స్థిరంగా ఉంటాయన్న అంచనాల మేరకు 2023 డిసెంబర్తో ముగిసిన మూడో త్రైమాసికంలో ఆర్ఐఎల్ నికరలాభం 9 శాతం వృద్ధిచెంది రూ.17,265 కోట్లకు (షేరుకు లాభం రూ.25.52) చేరినట్లు ఆర్ఐఎల్ శుక్రవారం తెలిపింది. క్రితం ఏడాది రూ.15,792 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. తాజాగా ముగిసిన క్యూ3లో కంపెనీ కార్యకలాపాల ఆదాయాన్ని దాదాపు ఫ్లాట్గా రూ.2.28 లక్షల కోట్ల మేర ప్రకటించింది. వివరాలు..
రిటైల్ లాభంలో 40 శాతం వృద్ధి
ఆర్ఐఎల్ వ్యాపార విభాగమైన రిలయన్స్ రిటైల్ మాత్రం క్యూ3లో లాభాల్ని గణనీయంగా పెంచుకుంది. డిసెంబర్ క్వార్టర్లో ఇది 40 శాతం వృద్ధిచెంది రూ. 3,165 కోట్లకు పెరిగింది. క్యూ3లో స్టోర్ల సంఖ్య 18,774 కోట్లకు చేరగా, క్యూ2తో పోలిస్తే స్టోర్లను సందర్శించిన వినియోగదారుల సంఖ్య 26 కోట్ల నుంచి 28.2 కోట్లకు పెరిగారు. గ్రోసరీ వ్యాపారం వృద్ధి 1 శాతానికి పరిమితమైనప్పటికీ, ఇతర రిటైల్ విభాగాల్లో విక్రయాలు జోరుగా జరిగినట్టు ఆర్ఐఎల్ తెలిపింది.
జియో లాభం రూ. 5,445 కోట్లు
ఆర్ఐఎల్ టెలికం సబ్సిడరీ రిలయన్స్ జియో నికరలాభం 12.2 శాతం వృద్ధితో రూ. 5,208 కోట్లకు చేరింది. 2022 డిసెంబర్ త్రైమాసికంలో ఇది రూ. 4,638 కోట్లు. ఇదే సమయంలో జియో ఆదాయం 10.3 శాతం పెరిగి రూ. 22,998 కోట్ల నుంచి రూ. 25,368 కోట్లకు చేరింది. జియో ప్లాట్ఫామ్స్ ఇబిటా 11 శాతం వృద్ధితో రూ. 13,955 కోట్లకు చేరింది. ఒక్కో యూజర్ నుంచి సమకూరే సగటు ఆదాయం (ఏపీఆర్యూ) 2 శాతం పెరిగి 181.7కు చేరింది. సెప్టెంబర్ చివరినాటికి 45.97 కోట్లు ఉన్న చందాదారుల సంఖ్య డిసెంబర్ చివరికి 47.09 కోట్లకు పెరిగింది.
దేశవ్యాప్తంగా 5జీ సర్వీసుల రోల్అవుట్ను జియో వేగంగా పూర్తిచేసింది. ప్రతీ నగరం, పట్టణం, గ్రామంలో ఇప్పుడు హైస్పీడ్ డిజిటల్ కనెక్టివిటీని అందుబాటులోకి తెచ్చాం. కొత్త బ్రాండ్లను అందించడం ద్వారా ఖాతాదారుల షాపింగ్ అనుభవాన్ని పెంపొందించడంపై రిలయన్స్ రిటైల్ దృష్టినిలిపింది. ఆయిల్, గ్యాస్ వ్యాపారం రికార్డుస్థాయి ఇబిటాను సాధించింది. భారత్ గ్యాస్ ఉత్పత్తిలో ఇప్పుడు 30 శాతం కేజీ డీ6 నుంచే వస్తున్నదని వెల్లడించడానికి సంతోషిస్తున్నా. ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో న్యూ ఎనర్జీ గిగా కాంప్లెక్స్ను ప్రారంభిస్తాం
-ముకేశ్ అంబానీ, ఆర్ఐఎల్ సీఎండీ