న్యూఢిల్లీ, మే 30: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) నికర లాభం 2022 జనవరి-మార్చి త్రైమాసికంలో స్టాండలోన్ ప్రాతిపాదికన రూ.2,372 కోట్లకు తగ్గింది. నిరుడు ఇదేకాలంలో ఆర్జించిన రూ. 2,893 కోట్లకంటే ఇది 18 శాతం తక్కువ. అయితే సంస్థ ప్రీమియం ఆదాయం మాత్రం రూ.1.22 లక్షల కోట్ల నుంచి రూ.1.44 లక్షల కోట్లకు పెరిగింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపాదికన సంస్థ లాభం 17 శాతం క్షీణించి రూ. 2,917 కోట్ల నుంచి రూ. 2,409 కోట్లకు తగ్గింది. సోమవారం సమావేశమైన ఎల్ఐసీ డైరెక్టర్ల బోర్డు రూ.10 ముఖ విలువగల ఒక్కోషేరుకు రూ.1.50 చొప్పున డివిడెండ్ను సిఫార్సుచేసింది.
ఈ డివిడెండ్కు షేర్హోల్డర్ల వార్షిక సర్వసభ్య సమావేశపు ఆమోదం లభించాల్సి ఉంది. సమీక్షా త్రైమాసికంలో పెట్టుబడుల ద్వారా ఎల్ఐసీకి ఒనగూడిన ఆదాయం స్వల్ప పెరుగుదలతో రూ.67,684 కోట్ల నుంచి రూ.67,856 కోట్లకు చేరింది. తొలి ఏడాది ప్రీమియం 32.65 శాతం వృద్ధిచెంది రూ.14,663 కోట్లకు చేరిందని, రెన్యువల్ ప్రీమియం 5.37 శాతం పెరిగి రూ.71,473 కోట్ల వద్ద నిలిచిందని ఎల్ఐసీ తెలిపింది. సింగిల్ ప్రీమియం ఆదాయం 33.70 శాతం వృద్ధిచెంది రూ. 58,251 కోట్లకు చేరింది.
రూ.21,000 కోట్ల ఐపీవో జారీచేసిన తర్వాత ఎల్ఐసీ ఆర్థిక ఫలితాల్ని ప్రకటించడం ఇదే ప్రథమం. అలాగే పబ్లిక్ షేర్హోల్డర్లకు తొలి డివిడెండ్ను సైతం ప్రకటించింది. రూ.949 ధరతో ఐపీవోను జారీచేయగా, ఈ షేర్లు ఈ నెల 17న లిస్టయిన సంగతి తెలిసిందే. సంస్థ ఫలితాల ప్రకటన నేపథ్యంలో సోమవారం ఈ షేరు బీఎస్ఈలో 1.89 శాతం లాభపడి రూ.837 వద్ద ముగిసింది. ఇది ఆఫర్ ధరకంటే 11.80 శాతం తక్కువ.