PSU Banks Profits | గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల లాభాలు రూ.లక్ష కోట్లు దాటాయి. ఇందులో అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐదే సగం కావడం గమనార్హం. అంతకుముందు 2017- 18లో ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.85,390 కోట్ల నికర నష్టం చవిచూశాయి. తిరిగి ఐదేండ్ల తర్వాత 2022- 23లో రూ.1,04,649 కోట్ల నికర లాభాలు గడించడం ఆసక్తికర పరిణామం.
అంతకుముందు సంవత్సరం (2021-22)తో పోల్చినా గత ఆర్థిక సంవత్సరం (2022- 23)లో దేశంలోని 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల లాభాలు 57 శాతం పెరిగాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర లాభంలో అత్యధికంగా 126 శాతం వృద్ధి రికార్డైంది. అటుపై యూకో బ్యాంక్ లాభం 100 శాతం పెరిగి రూ.1,862 కోట్ల వద్ద నిలిచింది. బ్యాంక్ ఆఫ్ బరోడా లాభం 94 శాతం గ్రోత్తో రూ.14,110 కోట్ల వద్ద స్థిర పడింది. 2021-21తో పోలిస్తే ఎస్బీఐ లాభం 59 శాతం పెరుగుదలతో రూ.50,232 కోట్ల వద్ద నిలిచింది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) మినహా అన్ని బ్యాంకుల పన్నేతర లాభాల్లో ఆకర్షణీయ గ్రోత్ రికార్డయింది. పీఎన్బీలో లాభం 2021-22తో పోలిస్తే గత ఏడాది 27 శాతం తగ్గి రూ.2,507 కోట్లకు చేరింది. అధిక వడ్డీ ఆదాయం రావడంతోపాటు మొండి బకాయిల నిర్వహణలో మెరుగుదల వంటి కారణాల వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకుల లాభాలు పెరిగాయని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు.