జీతంలో కొంత మదుపు చేయాలనుకునేవారికి ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) ఓ మంచి ఆప్షన్. ఒకవేళ ఇప్పటికే ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నట్టయితే అందులోనే వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ (వీపీఎఫ్) కూడా మదుపు చేయవచ్చు. ఈపీఎఫ్ కొనసాగింపు పథకమే వీపీఎఫ్. సాధారణంగా మనం ఈపీఎఫ్లో బేసిక్ పేలో 12 శాతాన్ని చెల్లిస్తాం. కానీ వీపీఎఫ్ ద్వారా బేసిక్ మొత్తాన్ని కూడా మదుపు చేయవచ్చు. ఈపీఎఫ్లో మాదిరిగానే రాబడి ఉంటుంది. అలాగే ఈపీఎఫ్ నిర్వహించే ఈపీఎఫ్వో సంస్థనే దీన్ని కూడా నిర్వహిస్తుంది.
వీపీఎఫ్ మదుపు ఎందుకు?
ఇందులో వడ్డీ రాబడితోపాటు పన్ను మినహాయింపులూ ఉంటాయి. వీపీఎఫ్ను ఎగ్జెంప్ట్ – ఎగ్జెంప్ట్ – ఎంగ్జెప్ట్ అనే బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం ప్రవేశపెట్టారు. అంటే కంట్రిబ్యూషన్పై పన్ను మినహాయింపు, ప్రిన్సిపల్పై పన్ను మినహాయింపు, అలాగే వడ్డీ ఆదాయంపైనా పన్ను మినహాయింపు అన్నమాట. ఆదాయ పన్ను చట్టం 80సీ కింద పన్ను మినహాయింపులన్నీ వర్తిస్తాయి. ఈ మినహాయింపులు పొందాలంటే నిబంధన ఒక్కటే. కనీసం ఐదేండ్లపాటు ఉద్యోగం చేయాలి. నిజానికి మీ వేతనంలో మిగులు మొత్తాన్ని బ్యాంక్ డిపాజిట్లలో మదుపు చేస్తే 6శాతంలోపే రాబడి ఉంటుంది. కానీ 2020-21 సంవత్సరానికి ప్రావిడెంట్ ఫండ్ మదుపుపై 8.5 శాతం వడ్డీని ఇప్పటికే ఈపీఎఫ్ ప్రకటించింది. భవిష్యత్తులో ఈ వడ్డీ రేటు మారినా అది బ్యాంక్ డిపాజిట్ల కన్నా అధికంగానే ఉండే అవకాశం ఉంది. మరోవైపు బ్యాంక్ డిపాజిట్ల మీద వచ్చే వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపులు దక్కవు.
ఎమర్జెన్సీ అవసరాల కోసం
వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ నుంచి నిధులను ఎమర్జెన్సీ అవసరాల కోసం విత్డ్రా చేయవచ్చు. తనకుగానీ, తన కుటుంబ సభ్యులకుగానీ ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు, పిల్లల ఉన్నత విద్య, వివాహం, సొంత ఇంటి నిర్మాణం, కొత్త ప్లాట్ లేదా ఇల్లు, ఫ్లాట్ కొనుగోలు కోసం విత్డ్రా చేసుకోవచ్చు.