న్యూఢిల్లీ, డిసెంబర్ 9: ప్రింట్ మీడియాపై ప్రకటనదారుల ఆకర్షణ వేగంగా పెరుగుతున్నది. కొవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో ఈ మీడియాకు దూరం జరిగిన అడ్వర్టైజర్లు తాజాగా యాడ్స్ను గణనీయంగా పెంచారు. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంతో పోలిస్తే జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ప్రింట్ మీడియాలో యాడ్స్ ఏకంగా 93 శాతం పెరిగాయి. 2020 జూలై-సెప్టెంబర్ మూడునెలల కాలంతో పోలిస్తే తాజాగా ముగిసిన త్రైమాసికంలో ఇవి 37 శాతం పెరిగినట్లు విశ్లేషణా సంస్థ టీఏఎం మీడియా రీసెర్స్ డివిజన్ యాడ్ఎక్స్ ఇండియా విడుదల చేసిన రిపోర్ట్లో వెల్లడించింది. దేశంలో 700కు పైగా వార్తా పత్రికలు, 180కు పైగా మెగజైన్లను పరిశీలించి రూపొందించిన వివరాలివి…
డిజిటల్/టెలివిజన్ మీడియా ఆర్జించే ప్రకటనల ఆదాయంలో ఫేస్బుక్ ఇండియా, గూగుల్ ఇండియాలు అత్యధికంగా చేజిక్కించుకుంటున్నాయి. డిజిటల్ ఆదాయంలో ఈ రెండు సంస్థల వాటా 80 శాతం ఉన్నట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ విశ్లేషణ వెల్లడిస్తున్నది. స్టాక్ ఎక్సేంజీల్లో లిస్టయిన టాప్-10 టెలివిజన్/డిజిటల్ కంపెనీలు 2020-21లో 8,396 కోట్ల ప్రకటన ఆదాయం సంపాదించగా, ఫేస్బుక్, గూగుల్లు రూ.23,213 కోట్లు ఆర్జించాయి.