(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): ఆప్తమిత్రుడు గౌతమ్ అదానీ కోసం ఇప్పటికే వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను కారుచౌకగా కట్టబెట్టిన ప్రధాని మోదీ.. దేశంలోనే అత్యంత రద్దీ ఎయిర్పోర్టులను కూడా ధారాదత్తం చేశారు. దీని కోసం నిబంధనలే మార్చారు. ఈ డీల్లో భారీ అవినీతి, అవకతవకలు జరిగాయంటూ ఆయా విమానాశ్రయాల్లో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులు కిందటేడాది పెద్దయెత్తున నిరసన చేపట్టినప్పటికీ వీటిని కేంద్రం పట్టించుకోలేదు. ఉద్దేశపూర్వకంగా మోదీ సర్కార్ ఏకంగా అదానీ ఎంటర్ప్రైజెస్కు అనుకూలంగా టెండర్ నిబంధనలను మార్చిందని మండిపడ్డారు. ఆరు ఎయిర్పోర్టుల నిర్వహణ బాధ్యతను తీసుకొనేందుకు అదానీ ఎంటర్ప్రైజెస్ కోట్ చేసిన మొత్తం పైన అనుమానాలు ఉన్నాయని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఎంప్లాయీస్ యూనియన్ (ఏయూఈ) హెచ్చరించినప్పటికీ వీటిని పట్టించుకున్నదాఖాల లేదు. ఇప్పుడు ఈ ఆరోపణలు నిజమని తెలిసింది. లాభాల్లో ఉన్న ఆరు ఎయిర్పోర్టులను లీజు పేరుతో అదానీ గ్రూప్నకు కేంద్రం కట్టబెట్టడంలో నిబంధనల ఉల్లంఘన జరిగినట్టు సమాచారం.
అహ్మదాబాద్, మంగళూరు, లక్నో, జైపూర్, గువాహటి, తిరువనంతపురంలోని విమానాశ్రయాల ఆధునీకరణకోసం కేంద్రం 2018 డిసెంబర్లో టెండర్లు పిలిచింది. అప్పటి వరకు ఎయిర్పోర్ట్ నిర్వహణలో ఎలాంటి అనుభవంలేని అదానీ గ్రూప్ కూడా ఈ బిడ్డింగ్లో పాల్గొంది. జాబితాలోని ఎయిర్పోర్టుల్లో రద్దీని దృష్టిలో ఉంచుకొని.. ఒక ప్రైవేట్ సంస్థకు రెండుకు మించి ఎయిర్పోర్టు నిర్వహణ బాధ్యతలు అప్పజెప్పకూడదని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్ ఎఫైర్స్ (డీఈఏ) సూచనలు చేసింది. ఒకవేళ, అలా చేస్తే, నిర్వహణ ప్రమాణాలు, ఆర్థిక ఒడిదుడుకులు ఎదురుకావచ్చని హెచ్చరించింది. సాంకేతికత పరంగా గతంలో అనుభవంలేని కంపెనీలకు ఎయిర్పోర్ట్ నిర్వహణ బాధ్యతలు అప్పజెప్పొద్దని నీతిఆయోగ్ కూడా తేల్చిచెప్పింది. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా-1994 చట్టం ప్రకారం.. ఏ ఎయిర్పోర్టును కూడా ప్రైవేట్ వ్యక్తులకు 30 ఏండ్లకు మించి లీజుకు ఇవ్వకూడదు. అయితే, డీఈఏ, నీతిఆయోగ్ సూచనలు, 1994 ఎయిర్పోర్ట్స్ చట్టాన్ని పట్టించుకోకుండా కేంద్రం.. ఈ ఆరు ఎయిర్పోర్టుల నిర్వహణ బాధ్యతను 50 ఏండ్లపాటు అదానీకిచ్చింది.
జీవీకే గ్రూప్ నిర్వహణలో ఉన్న ముంబై ఎయిర్పోర్ట్ కూడా చివరకు అదానీ గ్రూప్ కైవసం చేసుకొన్నది. ముంబై ఎయిర్పోర్ట్ అభివృద్ధిలో రూ. 705 కోట్ల అవకతవకలకు జరిగినట్టు 2020లో సీబీఐ.. జీవీకే గ్రూప్పై కేసు నమోదు చేసింది. అయితే, ఎప్పుడైతే, ఈ ఎయిర్పోర్ట్ నిర్వహణను అదానీ గ్రూప్నకు జీవీకే గ్రూప్ అప్పగించిందో.. సీబీఐ యూ-టర్న్ తీసుకొన్నది. ఈ కేసులో ఎలాంటి అవకతవకలు గుర్తించలేదంటూ కోర్టుకు తెలిపింది. జీవీకే గ్రూప్నకు ఒకవిధంగా క్లీన్ చిట్ ఇచ్చినట్లు అయింది. ఈ ఉదంతం వెనుక కేంద్రం ప్రమేయం ఉన్నదని విపక్షాలు ధ్వజమెత్తాయి.
అదానీ గ్రూప్ కంపెనీల బాండ్లకు విలువ లేదు. మార్జిన్ లోన్ల కోసం ఈ బాండ్లను అంగీకరించవద్దు. ఏపీసెజ్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై బాండ్ల విలువ సున్నా.
– క్రెడిట్ సూసీ
జార్ఖండ్లోని అదానీ థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి అదానీ పవర్ మాకు సరఫరా చేసే విద్యుత్తు కొనుగోలు ఒప్పందాన్ని సమీక్షించాలి. మార్కెట్ ధరలతో పోలిస్తే, మాకు ఎక్కువ ధరకు విద్యుత్తును విక్రయిస్తున్నారు. ప్రస్తుతం యూనిట్కు 22 టాకాల వరకు ఉన్న ధరను 12 టాకాలకు తగ్గించాలి. లేకపోతే విద్యుత్తు కొనుగోలు చేయబోం.
-బంగ్లాదేశ్ పవర్ డెవలప్ బోర్డు
కొద్దిరోజులుగా అదానీ సెక్యూరిటీల ధర పడిపోతున్నది. గ్రూప్ ఆర్థిక పరిస్థితి బాగాలేదంటూ వస్తున్న వార్తలొస్తున్నాయి. అందుకే అన్ని అదానీ గ్రూప్ కంపెనీలకు రుణాలను నిలిపేస్తున్నాం.
– సిటీ గ్రూప్
హిండెన్బర్గ్ ఆరోపణలతో సైస్టెన్బిలిటీ ఇండెక్స్ నుంచి అదానీ ఎంటర్ప్రైజెస్ను తొలగిస్తున్నాం.
– ఎస్అండ్పీ డోజోన్స్
అదానీ గ్రూప్ షేర్ల విలువ ఇలాగే పడిపోతే, నిధుల సమీకరణ కష్టం. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, అదానీ గ్రీన్ ఎనర్జీ రెస్ట్రిక్టెడ్ గ్రూప్, అదానీ ట్రాన్స్మిషన్ స్టెప్-వన్ లిమిటెడ్, అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్ల రేటింగ్ ఔట్లుక్ను నెగెటివ్లోకి మారుస్తున్నాం.
– మూడీస్