హైదరాబాద్, జూన్ 9: బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. శుక్రవారం హైదరాబాద్లో 10 గ్రాము ల 24 క్యారెట్ పసిడి రేటు రూ.460 ఎగిసి రూ. 60,680 పలికింది. 22 క్యారెట్ తులం విలువ రూ.400 ఎగబాకి రూ.55,600ను తాకింది. ఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ తులం ధర రూ.440 పుంజుకొని రూ.60,820కి చేరింది. ఇక కిలో వెండి ధర హైదరాబాద్లో ఈ ఒక్కరోజే ఏకంగా రూ.2,000 ఎగబాకింది. ఫలితంగా రేటు రూ.79,700లకు చేరింది. నగల తయారీదారులు, కొనుగోలుదారులతోపాటు పరిశ్రమ వర్గాల నుంచి భారీగా ఆదరణ రావడంతో ఈ స్థాయిలో ధరలు పెరిగాయని మార్కెట్ వర్గాలు తాజా ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నాయి. ఢిల్లీ మార్కెట్లోనూ కిలో వెండి విలువ రూ.1,050 అందుకుని రూ. 74,350ని చేరింది. కాగా, అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్సు బంగారం ధర 1,964 డాలర్లకు చేరుకోగా, వెండి ధర 24.35 డాలర్లకు చేరాయి.