న్యూఢిల్లీ, నవంబర్ 29: బంగారం ధరలు ఆల్టైమ్ హైకి చేరుకున్నాయి. బుధవారం హైదరాబాద్లో తులం రూ.820 ఎగబాకింది. దీంతో మునుపెన్నడూ లేనివిధంగా 24 క్యారెట్ పుత్తడి 10 గ్రాములు రూ.63,380ని తాకింది. ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్ పసిడి కూడా రూ.750 ఎగిసి రూ.58,100ను చేరింది. ఇక ఢిల్లీలో రూ.750 పుంజుకొని రూ.63,500 వద్ద గోల్డ్ రేటు నిలిచింది.
బంగారం ధరలు నిలకడగా పెరుగుతున్నాయి. గడిచిన వారం రోజుల్లో 24 క్యారెట్ తులం బంగారం రూ.1,410, 22 క్యారెట్ రూ.1,300 పుంజుకున్నది. ఈ క్రమంలోనే తాజాగా ఆల్టైమ్ హై వద్దకు చేరుకున్నాయి. అటు పండుగల సీజన్, ఇటు పెండ్లిళ్ల సీజన్ కావడంతో మార్కెట్లో పసిడి అమ్మకాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని వ్యాపారులు సైతం చెప్తున్నారు. నిరుడుతో పోల్చితే ఈ ఏడాది ధనత్రయోదశికి బంగారం విక్రయాలు పెరిగిన విషయం తెలిసిందే.
బంగారం ధరలతోపాటు వెండి ధరలూ పెరిగాయి. బుధవారం కిలో వెండి ధర హైదరాబాద్లో రూ.700 ఎగిసి రూ.82,200 లను తాకింది. గత వారం రోజుల్లోనూ రూ.3,200 పెరగడం గమనార్హం. ఢిల్లీలోనూ రూ.800 పుంజుకొని రూ.79,900 వద్ద నిలిచింది. సాధారణ కొనుగోలుదారులతోపాటు పరిశ్రమల నుంచీ డిమాండ్ ఉండటంతో ధరలు పెరుగుతున్నాయని వ్యాపార విశ్లేషకులు చెప్తున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ 2,041 డాలర్లకు చేరింది. సిల్వర్ 24.95 డాలర్లు పలికింది. ఇక కొమెక్స్లో ఫ్యూచర్ గోల్డ్ ఔన్స్ 2,041 డాలర్లు, సిల్వర్ 27 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్నది. డాలర్ బలహీనత, వడ్డీరేట్లపై ఫెడరల్ రిజర్వ్ తీరు మదుపరులను ఎక్కువగా ప్రభావితం చేస్తున్నట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.