హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వరంగ బ్యాంకైన బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ).. తెలంగాణ పోలీస్ శాఖతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. ఈ మేరకు డీజీపీ అంజనీకుమార్ ఆధ్వర్యంలో ఏడీజీ (స్పోర్ట్స్ అండ్ వెల్ఫేర్) అభిలాష బిస్త్ ఈ ఒప్పందంపై సంతకం చేశారు. దీంతో ఇక ఈ బ్యాంక్ ద్వారా సిబ్బందికి వేతనాలు, వ్యక్తిగత ప్రమాద బీమా, పెన్షన్లు, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు వంటి సేవలు అందనున్నాయి.
ఈ ఒప్పందంలో భాగంగా విధుల్లో ఉన్నప్పుడు మరణిస్తే రూ.1.05 కోట్లు, విధుల్లో లేనప్పుడు మరణిస్తే రూ.90 లక్షల బీమా కవరేజీ లభించనున్నది. శాశ్వత అంగవైకల్యానికి గురైతే రూ.60 లక్షలు, పాక్షిక అంగ వైకల్యం బారిన పడితే రూ.30 లక్షల వరకు కవరేజీ లభించనున్నది. ఈ సందర్భంగా బీవోబీ జీఎం, జోనల్ హెడ్ రితేశ్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ తమ బ్యాంక్ను ఎంచుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు.