Gold | వారం రోజులుగా హైదరాబాద్లోని జ్యువెల్లరీ ఆభరణాల దుకాణాలు కళకళలాడుతున్నాయి. 25 శాతం బంగారం బిస్కెట్ల కొనుగోళ్లు పెరిగాయి. 15 శాతం ఆభరణాల విక్రయాలు పెరిగాయి. దీనికి రూ.2000 కరెన్సీ నోటును మార్కెట్లో చలామణి నుంచి ఉపసంహరిస్తూ ఆర్బీఐ గతవారం నిర్ణయం తీసుకోవడమే కారణంగా కనిపిస్తున్నది.
బ్యాంకుల్లో రూ.2000 నోటు మార్పిడికి, డిపాజిట్లకు ఆర్బీఐ మార్గదర్శకాలు జారీ చేసింది. రూ.20 వేల వరకు రూ.2000 కరెన్సీ నోట్ల మార్పిడికి అనుమతి ఇచ్చిన ఆర్బీఐ.. డిపాజిట్లపై ఎటువంటి పరిమితుల్లేవని పేర్కొంది. అయితే, ఆదాయం పన్నుశాఖ నిబంధన ప్రకారం రూ.50 వేలకు పైగా డిపాజిట్లు చేస్తే పాన్ కార్డు సమర్పించడం తప్పనిసరి. ప్రతి రోజూ ఒక వ్యక్తి రూ.2 లక్షల్లోపు నగదుతో బంగారం కొనుగోలు చేయొచ్చు. రూ.2 లక్షలు దాటితే మాత్రం పాన్ లేదా ఆధార్ కార్డు సమర్పించాల్సి ఉంటుంది.
ఈ పరిస్థితుల్లో రూ.2000 నోట్లను చూస్తేనే హైదరాబాద్ తోపాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాల దుకాణాలు, షాపింగ్ మాల్స్ పెదవి విరుస్తున్నాయి. తొలుత పెట్రోల్ బంకుల్లో కస్టమర్లు రూ.2000 నోట్లు మార్చుకోవడానికి ప్రయత్నించారు. కానీ ప్రతి రోజూ రూ.2000 నోట్లతో పెట్రోల్ నింపుకోవడానికి ప్రయత్నించడం పెట్రోల్ బంకుల యాజమాన్యాలకు ఇబ్బందికరంగా మారింది. వారు సైతం రూ.2000 నోట్లను తమ బ్యాంకు శాఖల్లో డిపాజిట్లు చేయాల్సి ఉంటుంది. అందుకు బ్యాంకులు, ఆదాయం పన్నుశాఖ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. దీనికితోడు ప్రతి ఒక్కరికీ చిల్లర మార్చి ఇవ్వాలన్నా సాధ్యం కాని పరిస్థితి నెలకొంది.
రూ.2000 కరెన్సీ నోట్ల మార్పిడికి, డిపాజిట్లకు ఎటువంటి నిబంధనలు, మార్గదర్శకాల్లేవని ఆర్బీఐ చెప్పినా.. ఎస్బీఐ, హెచ్డీఎప్సీ బ్యాంక్ వంటి బ్యాంకులు నోటిఫికేషన్లు జారీ చేసినా.. కొన్ని బ్యాంకులు ప్రత్యేకించి ప్రైవేట్ బ్యాంకులు సొంతంగా నిబంధనలు అమలు చేస్తున్నాయి. 2017 మార్చి తర్వాత రూ.2000 కరెన్సీ నోట్ల చలామణి మార్కెట్లో దాదాపుగా పూర్తిగా తగ్గిపోయింది. సామాన్యులెవరి వద్ద రూ.2000 నోట్లు అందుబాటులో లేవు. ఫలితంగా సామాన్యులు దాదాపు రూ.2000 కరెన్సీ నోట్లను మరిచిపోయారన్న మాటలు వినిపిస్తున్నాయి.
వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ లు మాత్రమే భారీగా బంగారం కొనుగోళ్లు చేస్తున్నారు. ప్రముఖుల నుంచి డిమాండ్ పెరగడంతో బంగారం ఆభరణాల దుకాణాలు సైతం ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి.