Go First-Air India | స్వచ్చంద దివాళా పిటిషన్ దాఖలు చేసిన ప్రైవేట్ విమానయాన సంస్థ ‘గోఫస్ట్’ మరిన్ని కష్టాల్లో చిక్కుకున్నది. ఈ నెల రెండో తేదీన ఎన్సీఎల్టీ వద్ద గోఫస్ట్ దివాళా పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే విమానాలు నేలకు పరిమితం కావడంతో గోఫస్ట్ కెప్టెన్లుగా ఉన్న పైలట్లు, ఇతర సిబ్బంది ఆల్టర్నేటివ్ మార్గాలపై ఫోకస్ చేస్తున్నారు. టాటా సన్స్ ఆధీనంలోని ఎయిర్ ఇండియాలో చేరేందుకు 200 మంది గోఫస్ట్ పైలట్లు ఆఫర్లు ఆమోదించారు. ఈ నేపథ్యంలో పైలట్లను కాపాడుకునే పనిలో పడింది. కెప్టెన్లుగా ఉన్న పైలట్లకు నెల వారీ వేతనం రూ.లక్ష (1222 డాలర్లు), ఫస్ట్ ఆఫీసర్ల వేతనం రూ.50 వేలు పెంచుతామని ప్రతిపాదించింది. ఈ మేరకు పైలట్లకు పంపిన ఈ-మెయిల్లో పెంచిన జీతాలు జూన్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తాయని తెలిపినట్లు బ్లూంబర్గ్ న్యూస్ వెల్లడించింది. ఇప్పటికే కంపెనీ నుంచి వెళ్లిన వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. వచ్చేనెల 15 లోగా వారు తమ రాజీనామాలు ఉపసంహరించుకుంటే ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొన్నట్లు సమాచారం.
గోఫస్ట్ కెప్టెన్లు ప్రస్తుతం సగటున రూ.5.30 లక్షలు పొందుతున్నారు. స్పైస్ జెట్ పైలట్లు రూ.7.50 లక్షల వేతనం అందుకుంటూ ఉండటం గమనార్హం. మరోవైపు సంస్థ సేవల పునరుద్ధరణతోపాటు ఇప్పుడు ఎంత మంది పైలట్లు ఉన్నారన్న విషయమై నెల రోజుల్లో నివేదిక సమర్పించాలని గో-ఫస్ట్ యాజమాన్యాన్ని డీజీసీఏ గత వారం ఆదేశించింది.
ఇదిలా ఉంటే గోఫస్ట్ సేవలు నిలిచిపోవడంతో ఆ సంస్థ పైలట్లు దాదాపు 200 మంది ఎయిర్ ఇండియాలో చేరారు. వారిలో 75 మంది సోమవారం నుంచి ఎయిర్ ఇండియా శిక్షణ పొందుతున్నారు. దీనిపై స్పందించేందుకు గోఫస్ట్ యాజమాన్యం అందుబాటులోకి రాలేదు. గోఫస్ట్ సేవలు నిలిచిపోయిన కొన్ని రోజులకే బెంగళూరు, ఢిల్లీ, ముంబైల్లో ఎయిర్ ఇండియా పైలట్ల కోసం వాక్-ఇన్-ఇంటర్వ్యూలు నిర్వహించింది. అందుకోసం 700కి పైగా అప్లికేషన్లు వచ్చాయని ఎయిర్ ఇండియా వెల్లడించింది.