పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. పశ్చిమబెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా పన్ను పెంచడం వల్లే లీటర్ పెట్రోల్ ధర రూ.100 మార్క్ దాటిందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తేవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకోవడం లేదని ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూలో చెప్పారు.
భవానీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ప్రియాంకా టిబ్రేవాల్ తరఫున ఆయన ప్రచారం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా (పశ్చిమబెంగాల్)లు విధించే మొత్తం పన్ను సుమారు 40 శాతం. ప్రకటనలు చేయడం చాలా తేలిక.. మీరు (తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం) రూ.3.51 పన్ను పెంచకుంటే లీటర్ పెట్రోల్ రూ.100 లోపే ఉంటుంది అని అన్నారు.
భవానీపూర్ నియోజకవర్గం నుంచి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. సాధారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరకు అనుగుణంగా దేశీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెరుగుతుంటాయి.