న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మళ్లీ పెరిగాయి. ఏకంగా 10 నెలల గరిష్ఠాన్ని తాకుతూ పీపా ధర 90 డాలర్ల దరిదాపుల్లోకి వచ్చింది. ఈ ఏడాదిలో క్రూడాయిల్ బ్యారెల్ రేటు ఈ స్థాయికి రావడం ఇదే తొలిసారి.
సౌదీ అరేబియా, రష్యా దేశాలు తీసుకున్న నిర్ణయమే.. గ్లోబల్ క్రూడ్ మర్కెట్లో అలజడికి దారితీసింది. చమురు ధరల స్థిరీకరణ, పెరుగుదల నిమిత్తం ఉత్పత్తిని, ఎగుమతులను స్వచ్చంధంగా తగ్గించుకోవాలని ఈ రెండు దేశాలు గతంలోనే నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది ఆఖరుదాకా తమ ఉత్పత్తి, ఎగుమతుల కోత నిర్ణయాన్ని పొడిగిస్తున్నట్టు సౌదీ, రష్యాలు ఇటీవల ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే గత వారం రోజుల్లో బ్రెంట్ క్రూడ్ ధరలు సుమారు 6.5 శాతం ఎగబాకాయి. బుధవారం బ్యారెల్ ధర 89.67 డాలర్లు పలికింది. దీంతో భారత్లో పెట్రో ధరలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.