Petrol price | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఏకంగా సుమారు ఏడాది గరిష్ఠాన్ని తాకుతూ పీపా ధర 90 డాలర్లపైకి వచ్చింది. ఈ ఏడాదిలో క్రూడాయిల్ బ్యారెల్ రేటు ఈ స్థాయికి రావడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో ఆయా దేశాల్లో.. ముఖ్యంగా భారత్ వంటి ముడి చమురు దిగుమతి ఆధారిత దేశాల్లో పెట్రో ధరలు భగ్గుమనవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
సౌదీ-రష్యా దెబ్బ
సౌదీ అరేబియా, రష్యా దేశాలు తీసుకున్న నిర్ణయమే.. గ్లోబల్ క్రూడ్ మర్కెట్లో అలజడికి దారితీసింది. చమురు ధరల స్థిరీకరణ, పెరుగుదల నిమిత్తం ఉత్పత్తిని, ఎగుమతులను స్వచ్చంధంగా తగ్గించుకోవాలని ఈ రెండు దేశాలు గతంలోనే నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది ఆఖరుదాకా తమ ఉత్పత్తి, ఎగుమతుల కోత నిర్ణయాన్ని పొడిగిస్తున్నట్టు సౌదీ, రష్యాలు ఇటీవల ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే గత వారం, 10 రోజుల్లో బ్రెంట్ క్రూడ్ ధరలు సుమారు 6.8 శాతం ఎగబాకాయి. శుక్రవారం బ్యారెల్ ధర 90.89 డాలర్లు పలికింది. గ్లోబల్ మార్కెట్కు జరిగే రోజువారీ చమురు సరఫరాలో 10 లక్షల బ్యారెళ్ల తగ్గింపు.. డిసెంబర్ చివరిదాకా కొనసాగుతుందని సౌదీ అరేబియా స్పష్టం చేసింది. రష్యా కూడా ఎగుమతులకు కోత పెడుతామన్నది.
పెరుగుతున్న భారం
గ్లోబల్ మార్కెట్లో పెరుగుతున్న ముడి చమురు ధరలు.. భారత్ దిగుమతులను మరింత భారంగా మారుస్తున్నాయి. ఆగస్టులో బ్యారెల్ ముడి చమురును సగటున 86.43 డాలర్ల చొప్పున వెచ్చించి భారత్ దిగుమతి చేసుకున్నది. ఈ నెలలో 89-90 డాలర్ల మధ్య జరుగుతున్నాయి. ఇక ఈ ఏడాది మే-జూన్ నెలల్లోనైతే సగటున బ్యారెల్ క్రూడ్ ధర 73-75 డాలర్ల మధ్యే ఉన్నది. జూలైలో 80.37 డాలర్లు పలికింది. దీన్నిబట్టి చమురు ఉత్పాదక దేశాలు.. ధరల్ని పెంచేందుకు చేపట్టిన చర్యలు సత్ఫలితాల్నే ఇస్తున్నట్టు స్పష్టమవుతుండగా, భారత్ వంటి దిగుమతి ఆధారిత దేశాలకు పెద్ద దెబ్బే తగులుతున్నట్టు కనిపిస్తున్నది.
రూపాయితో సమస్య తీవ్రం
డాలర్తో పోల్చితే అంతకంతకూ పడిపోతున్న రూపాయి మారకం విలువ కూడా దేశీయ ముడి చమురు దిగుమతుల్ని ఇంకా భారం చేస్తున్నది. అంతర్జాతీయ వాణిజ్యం.. గ్లోబల్ కరెన్సీగా ఉన్న అమెరికా డాలర్ ఆధారంగానే నడుస్తుందన్న సంగతి విదితమే. ఈ క్రమంలో డాలర్ ముందు తేలిపోతున్న రూపాయి.. దిగుమతుల విలువను ఊరకనే పెంచేస్తున్నది. ఫారెక్స్ మార్కెట్లో రూపాయికి తగ్గుతున్న ఒక్కో పైసా విలువ.. ముడి చమురు రేటును అంతకంతా పెంచుతూపోతున్నది. ప్రస్తుతం రూపాయి మారకం విలువ 83 డాలర్లపైనే ఉన్నది. మరింత పడిపోతే చమురు సంక్షోభం తప్పదన్న హెచ్చరికలు వస్తున్నాయి.
ఎన్నికలు ముగిస్తే మోతే..
ప్రస్తుతం దేశీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ఇతర ఇంధన ధరలన్నీ అంతర్జాతీయ మార్కెట్ ఆధారంగానే నడుస్తున్నాయి. అయితే మార్కెట్లో మెజారిటీ వాటా ప్రభుత్వ రంగ సంస్థల చేతుల్లోనే ఉండటంతో.. ఇంకా పెట్రో ధరలపై నిర్ణయాధికారం కేంద్ర ప్రభుత్వం అధీనంలోనే ఉందని చెప్పుకోవచ్చు. గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతున్నా.. మోదీ సర్కారు వంట గ్యాస్ ధరను తగ్గించడం, 17 నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎటువంటి మార్పులు లేకపోవడమే ఇందుకు ఉదాహరణగా అంతా చెప్తున్నారు. ఆయా రాష్ర్టాల ఎన్నికలు, వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికల దృష్ట్యానే కేంద్రం నుంచి వెళ్లిన ఆదేశాలతో ప్రభుత్వ చమురు మార్కెటింగ్ సంస్థలు.. ధరల పెంపు జోలికి వెళ్లలేకపోతున్నాయని అంటున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికలు ముగిస్తే.. ధరల మోత ఖాయమన్న అభిప్రాయాలను వెలిబుచ్చుతున్నారు. నిజానికి దేశీయ ఇంధన ధరల్ని అంతర్జాతీయ మార్కెట్కు అనుసంధానం చేసిన దగ్గర్నుంచి రోజూ చమురు ధరల్ని సమీక్షించాల్సి ఉన్నది. కానీ నిరుడు ఏప్రిల్ 6 నుంచి అలాగే ఉంటున్నాయి. గత ఏడాది మేలో ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో చివరిసారిగా ధరల్లో మార్పు చోటుచేసుకున్నది.
భారత్పై ప్రభావం
దేశీయ ఇంధన అవసరాలు 85 శాతానికిపైగా దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల కదలికలు.. భారతీయ విపణిపై తీవ్ర ప్రభావాన్నే చూపుతాయి. ఈ క్రమంలో గ్లోబల్ మార్కెట్లో ప్రస్తుతం పెరుగుతున్న ధరలు.. దేశీయ మార్కెట్లో సమీప భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ తదితర ఇంధన ధరల తగ్గుదలకున్న అవకాశాలను ఇంకా తగ్గిస్తాయన్న అంచనాలున్నాయి. ఇప్పటికే ఆయా రాష్ర్టాల ఆధారంగా కాస్త అటుఇటుగా లీటర్ పెట్రోల్ రేటు రూ.95 నుంచి రూ.113 మధ్య, డీజిల్ ధర రూ.83 నుంచి రూ.99 మధ్య ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగినకొద్దీ.. ఈ ధరల్లోనూ మార్పులు వస్తాయని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి.
దేశ ఆర్థిక వ్యవస్థకూ ముప్పే
పెరుగుతున్న ముడి చమురు ధరలు.. దేశ ఆర్థిక వ్యవస్థనూ ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయి. రవాణా చార్జీలు పెరిగి, అన్ని వస్తూత్పత్తుల ధరలకు రెక్కలు తొడుగుతాయి. దీనివల్ల ద్రవ్యోల్బణం అదుపు తప్పుతుందని, ఇదే జరిగితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వడ్డీరేట్లను పెంచుతుందని, బ్యాంక్ రుణాలు భారమై.. మార్కెట్లో ద్రవ్యలభ్యత తగ్గుతుందని అంటున్నారు. నిర్మాణ, ఆటో, వాటి అనుబంధ రంగాల్లో అమ్మకాలు పడిపోవడం, లాభాలు తగ్గడం, వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా కంపెనీల ఉద్యోగ కోతలు.. నిరుద్యోగం వంటివి పెరిగిపోతాయని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. దీంతో మొత్తం దేశ ఆర్థిక వృద్ధిరేటే ప్రమాదంలో పడిపోతుందని వివరిస్తున్నారు. కాబట్టి ముడి చమురు ధరల పెరుగుదలను తేలిగ్గా తీసుకోలేని పరిస్థితే. అయితే ఇంధన ధరలపై వేస్తున్న సుంకాలు, రకరకాల సెస్సులను కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తే కొంత ఊరట లభిస్తుందని అభిప్రాయపడుతున్నారు.