ముంబై: మళ్లీ దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ మళ్లీ వరుసగా పెరుగుతున్నాయి. శనివారం పెరుగుదలతో దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబై, మధ్యప్రదేశ్లోని భోపాల్, ఆంధ్రప్రదేశ్లోని గుంటూరుల్లో పెట్రోల్ ధర సెంచరీ మార్క్ దాటింది.
దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.93.94, డీజిల్ రూ.84.89 పలికింది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.100 మార్క్ దాటితే, డీజిల్ ధర రూ.92.17గా ఉంది. సెంచరీ మార్కు దాటిన మెట్రోపాలిటన్ సిటీల్లో ముంబై మొదటిది.
ఇంతకుముందే రాజస్థాన్లోని శ్రీ గంగానగర్, మధ్యప్రదేశ్లోని భోపాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటేసింది. శుక్రవారం పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగలేదు.
అంతకుముందు గురువారం పెరిగిన ధరలతో మహారాష్ట్రలోని ఠాణె నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.100 మార్క్ను అధిగమించింది. ఇక రాజస్థాన్ రాజధాని జైపూర్లో రూ.100కు చేరింది.
జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఇప్పటికే ముంబై నగరంతోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రీమియం పెట్రోల్ లీటర్ ధర రూ.100 మార్కును దాటేసింది. కేంద్ర ముడి చమురు సంస్థలు శుక్రవారం 25-30 పైసలు పెంచాయి.
ఈ నెలలో 15 రోజులు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్పై రూ.3.53, లీటర్ డీజిల్పై రూ.4.18 పెరిగింది.
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్థానిక పన్నులు ఇమిడి ఉన్నాయి. వ్యాట్, రవాణా చార్జీలు కలగలసి ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు మొత్తం లీటర్ పెట్రోల్పై 60 శాతం, లీటర్ డీజిల్పై 54 శాతానికి పైగా ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వం లీటర్ పెట్రోల్పై రూ.32.90, లీటర్ డీజిల్పై రూ.31.80 ఎక్సైజ్ సుంకం వసూలు చేస్తున్నది. రాష్ట్రాల్లో అత్యధికంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్ వ్యాట్ విధిస్తున్నాయి.
వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలిలా:
నగరం —- పెట్రోల్ (రూ/ లీటర్) — డీజిల్ (రూ/ లీటర్)
ఢిల్లీ —- ——— 93.94 —- —- —- — 84.89
ముంబై — ——- 100.19 ——– ——- 92.17
కోల్కతా —- —— 93.97 —- —- —- — 87.74
చెన్నై —- —- —- 95.51 —- —- —- — 89.65
బెంగళూరు —- — 97.07 —- —- —— 89.99
హైదరాబాద్ —— 97.63 —- —- —— 92.54
నోయిడా —- —— 91.49 —— —- —– 85.36
భోపాల్ —– —— 102.04 —- —- —– 93.37
పాట్నా ——- —– 96.10 —- —- —— 90.16
లక్నో —— ——– 91.41 —- —- —– 85.28