Home Loans | ప్రపంచాన్నే గడగడలాడించిన కరోనా మహమ్మారి ప్రజల జీవితాల్లో సమూల మార్పులే తెచ్చింది. ప్రత్యేకించి దేశీయ హౌసింగ్ సెక్టార్పై ప్రత్యక్ష ప్రభావం చూపింది. 2018-19 నుంచి 2021-22 మధ్య రుణాలతో సొంతింటి కొనుగోళ్లు సరాసరి 11 శాతం పెరిగాయని భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) అధ్యయనం తెలిపింది. అందులో టైర్-3, టైర్-4 సిటీస్ పరిధిలో రుణాలతో ఇండ్ల కొనుగోళ్లు 12-13 శాతం పెరిగాయని పేర్కొంది. చిన్న పట్టణాల్లో ఇండ్ల రుణాలు తీసుకున్న వారిలో మహిళలు 86 శాతం మంది ఉన్నారని పేర్కొంది.
ఢిల్లీ, ముంబై వంటి ప్రథమ శ్రేణి నగరాలతో పోలిస్తే ఇటీవలి కాలంలో భోపాల్, ఇండోర్, చండీగఢ్ వంటి టైర్-2, అలీగఢ్, బరోడా, మదురై తరహా టైర్-3, అంత కంటే చిన్న నగరాలు, పట్టణాల్లో బ్యాంకులు, ఆర్థిక సంస్థల రుణాలతో సగటున ఇండ్ల కొనుగోళ్లు పెరిగాయి. కొవిడ్-19ను కట్టడి చేయడానికి వర్క్ ఫ్రం హోం విధానం పెరిగిపోవడంతో చిన్న పట్టణాల్లో రుణాలతో సొంతిల్లు కొనుగోలు చేసిన వారు పెరిగారని ఎస్బీఐ నివేదించింది.
వర్క్ ఫ్రం హోం వల్ల ఇండ్ల నుంచి డిజిటల్ ఆఫీస్ నిర్వహించాల్సి రావడంతో కుటుంబాల ప్రాధాన్యాల్లో మార్పులు వచ్చాయి. కొంత మంది సుదీర్ఘ కాలం వర్క్ ఫ్రం హోం సేవలందించాల్సి రావడం, మరికొందరు ఇండ్లనే డిజిటల్ ఆఫీసులుగా మార్చుకోవడం వంటి పరిణామాలతో టైర్-3, టైర్-4 నగరాల పరిధిలో సొంతిల్లు కలిగి ఉండాల్సి వచ్చింది. దీంతో చిన్నా చితకా పట్టణాల్లో కూడా ఇండ్ల కొనుగోళ్లు ఎక్కువయ్యాయి.
గత నాలుగేండ్లలో చిన్నా చితకా నగరాలు, పట్టణాల్లో సొంతిండ్లకు డిమాండ్ పెరగడంతో మెట్రోపాలిటన్, నగరాలతో పోలిస్తే టైర్-3&4 సిటీల్లో ఇండ్ల ధరలకు రెక్కలొచ్చాయి. ఢిల్లీ, ముంబై, చండీగఢ్, ఇండోర్ వంటి నగరాల కంటే రాయ్పూర్, సూరత్, జైపూర్, లక్నో నగరాల్లో ఇండ్ల ధరలు శరవేగంగా పెరిగాయి.
టైర్-4 సిటీస్, పట్టణాల్లో ఇండ్ల రుణాలు తీసుకున్న వారిలో దాదాపు సగం మంది మహిళామణులే. కొన్ని నగరాల్లో మూడొంతుల కంటే ఎక్కువగా మహిళలు రుణాలు తీసుకున్నారు. గుజరాత్లోని దాంగ్లో 86 శాతం, బీహార్లోని అర్వాల్లో 75 శాతం ఇండ్ల రుణాలు మహిళలవే. ఇండ్ల రుణాలపై 0.10 శాతం సబ్సిడీ కల్పించడం దీనికి కారణం. ఆయా బ్యాంకులు, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ఇండ్ల రుణాలపై రాయితీలు కూడా కల్పించాయి.
2018-19 నుంచి 2021-22 మధ్య చిన్నా చితకా (టైర్-3, టైర్-4) నగరాల్లో రుణాలతో కొత్తగా సొంతింటిని కొనుగోలు చేసిన వారు 36 శాతం మంది ఉన్నారు. 2018-19లో చిన్న పట్టణాల్లో ఇండ్ల రుణాలు 32 శాతమే. ఉత్తరప్రదేశ్, కర్ణాటక, పంజాబ్ రాష్ట్రాల్లోని చిన్న పట్టణాల్లో రుణాలతో ఎక్కువ మంది సొంతిల్లు కొనుగోలు చేశారు.