ముంబై, జూలై 20: స్టాక్ మార్కెట్లలోకి పెన్షన్ నిధులు వెల్లువెత్తనున్నాయి. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ల (ఐపీవో)లో పెట్టుబడులు పెట్టేందుకు త్వరలో పెన్షన్ ఫండ్ మేనేజర్ల (పీఎఫ్ఎం)ను అనుమతిస్తామని పెన్షన్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) ప్రకటించింది. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ)ల్లో నమోదైన టాప్-200 సంస్థల్లోని షేర్లను కొనేందుకూ ఫండ్ మేనేజర్లకు అవకాశం ఇవ్వనున్నట్లు పీఎఫ్ఆర్డీఏ చైర్మన్ సుప్రతిమ్ బందోపాధ్యాయ్ మంగళవారం ఇక్కడ విలేకరులకు తెలిపారు. పెట్టుబడుల విషయంలో ఫండ్ మేనేజర్లకే పూర్తి స్వేచ్ఛను ఇవ్వాలనే యోచనలో కూడా ఉన్నామని చెప్పారు. అలాగే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్ ట్రస్టులు జారీచేసే రుణ పత్రాల్లోనూ పెట్టుబడులు పెట్టేందుకు ఫండ్ మేనేజర్లను అనుమతించే వీలుందన్నారు.
ప్రస్తుతం ఫండ్ మేనేజర్ల పెట్టుబడులపై కొన్ని ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్ల సెగ్మెంట్లో ట్రేడ్ అవుతున్న రూ.5వేల కోట్లకుపైగా మార్కెట్ విలువ కలిగిన సంస్థల షేర్లలోనే పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉన్నది. దీంతో గతంలో డీమార్ట్ షేర్లకు దూరంగా ఉండాల్సి రాగా, ఇప్పుడు ఆ షేర్లు పంచుతున్న లాభాల విషయం తెలిసిందే. ఈ క్రమంలో పీఎఫ్ఆర్డీఏ తాజా నిర్ణయానికి రాగా, మరిన్ని ఈక్విటీ పెట్టుబడులకు వీలుగా రాబోయే 2, 3 రోజు ల్లో కొత్త నిబంధనలను ప్రకటిస్తామని బందోపాధ్యాయ్ చెప్పారు. దీంతో ఐపీవోతోపాటు ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్లు, ఆఫర్ ఫర్ సేల్లో ఇకపై ఫండ్ మేనేజర్లూ పాల్గొననున్నారు.
ప్రస్తుతం స్టాక్ మార్కెట్ పెట్టుబడులపై మదుపరులకు 11.31 శాతం వార్షిక రిటర్నులు వస్తున్నాయి. కార్పొరేట్ డెట్ ఫండ్లపై ప్రతిఫలం 10.21 శాతం, ప్రభుత్వ సెక్యూరిటీలపై 9.69 శాతం లాభం ఇన్వెస్టర్లకు అందుతున్నది. పెన్షన్ సొమ్మును స్టాక్ మార్కెట్లలోకి మరింతగా తీసుకెళ్తే మదుపరులకు లాభం ఉంటుందన్న అభిప్రాయం ఉంది. పెన్షన్ ఫండ్స్ ఎన్పీఎస్ ఖాతాదారుల మొత్తం సంఖ్య 4.37 కోట్లుగా ఉన్నది.