న్యూఢిల్లీ, ఆగస్టు 11: పతంజలి ఫుడ్స్ లాభాలకు వంటనూనెల ధర సెగ గట్టిగానే తగిలింది. జూన్తో ముగిసిన త్రైమాసికానికిగాను నికర లాభం ఏడాది ప్రాతిపదికన 64 శాతం కుంగి రూ.87.75 కోట్లకు పడిపోయినట్లు వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.241.25 కోట్ల లాభాన్ని గడించింది.
సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.7,370 కోట్ల నుంచి రూ.7,810 కోట్లకు చేరుకున్నట్లు సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది. ధరలు తగ్గుముఖం పట్టడంతో వంటనూనెల విక్రయాలు భారీగా పెరిగి రూ.5,890.73 కోట్లకు చేరుకున్నాయి. గత త్రైమాసికంలో అకస్మాత్తుగా వంటనూనెల ధరలు భారీగా తగ్గడంతో వంటనూనెల పరిశ్రమపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపిందని పేర్కొంది.