Air India | 150 మందికి పైగా ఎయిర్ఇండియా ప్రయాణికులు మహారాష్ట్రలోని పుణె నుంచి ఢిల్లీకి చేరుకోవడానికి దాదాపు 24 గంటల టైం పట్టింది. గురువారం రాత్రి దేశ రాజధాని ఢిల్లీ నగర పరిధిలో రన్ వేపై దిగడానికి బదులు ఎయిర్ ఇండియా విమానం రాజస్థాన్ రాజధాని జైపూర్ నగరానికి వెళుతుందని పైలట్ ప్రకటించారు. కానీ శుక్రవారం తెల్లవారుజామున మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ విమానాశ్రయంలో ల్యాండయింది. అక్కడ మూడు గంటలు గడిపిన ప్రయాణికులు.. తర్వాత రోడ్డు మార్గంలో దాదాపు 24 గంటల తర్వాత ఢిల్లీకి చేరుకున్నారు.
ఎయిర్ ఇండియా (ఏఐ-850) విమానం గురువారం సాయంత్రం 6.50 గంటలకు టేకాఫ్ కాగా, ఢిల్లీలో రాత్రి 9.05 గంటలకు ల్యాండింగ్ కావాల్సి ఉంది. కానీ శుక్రవారం సాయంత్రం దాదాపు ఆరు గంటలకు ఢిల్లీకి చేరుకున్నట్లు ముఖద్దాస్ అన్సారీ మీడియాకు చెప్పారు.
ఢిల్లీ శివారుల్లోకి విమానం చేరే సమయానికి గగనతలంలో పొగలు కమ్మేశాయి. దీంతో ఢిల్లీలో వాతావరణ పరిస్థితులు అననుకూలంగా ఉన్నందున విమానాన్ని జైపూర్ విమానాశ్రయానికి తరలిస్తున్నట్లు పైలట్ ప్రకటించారు. చివరకు గురువారం అర్ధరాత్రి 12.30 గంటలకు గ్వాలియర్ విమానాశ్రయానికి చేరిందని ముఖద్దాస్ అన్సారీ చెప్పారు.
విమానం టర్మినల్ లోకి వెళ్లిన తర్వాత దాని పైలట్, ఇతర అధికారులు ప్రయాణికులకు రెండు ఆప్షన్లు ఇచ్చారు. ఢిల్లీలో వాతావరణ పరిస్థితి మెరుగైన తర్వాత విమానంలోనే వెళ్లాలనుకునే వారు హోటళ్లలో బస చేయాలని, రోడ్డు మార్గంలో మధ్యప్రదేశ్ మీదుగా తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చునని చెప్పారు. ఈ సమస్యకు కారణం ఏమిటో తెలుసుకోవాల్సి ఉందని ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి తెలిపారు.