ముంబై, ఫిబ్రవరి 26: వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25)లో ప్యాసింజర్ వాహన విక్రయాలు 5-7 శాతం వరకు పెరిగే అవకాశం ఉన్నదని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తెలిపింది. ఎస్యూవీలకు డిమాండ్ అధికంగా ఉండటం ఇందుకు కారణమని సోమవారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. కొనుగోలుదారుల అభిరుచులు ఏడాదిగా మారుతూ వస్తున్నాయని, ముఖ్యంగా విలాసవంతమైన కార్లకు మొగ్గుచూపుతున్నారని, భద్రత కూడా అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపింది.
దేశవ్యాప్తంగా అమ్ముడవుతున్న కార్ల విక్రయాల్లో 2018-19లో 28 శాతంగా ఉన్న ఎస్యూవీల వాటా రెండింతలు పెరిగి 60 శాతానికి పెరిగిందని వెల్లడించింది. మార్కెట్లోకి నూతన మాడళ్లు అందుబాటులోకి రావడం, ధరలు ఆశించిన స్థాయిలో ఉండటం, ఎలక్ట్రిక్ వాహనాలు కూడా మార్కెట్లోకి విడుదలకావడం కూడా ఇందుకు కారణమని తెలిపింది.