న్యూఢిల్లీ, మే 29: రిజర్వ్ బ్యాంక్ రెపోరేటును ఈ ఏడాది అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో తగ్గించే వీలుందని ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ సోమవారం అంచనా వేసింది. ద్రవ్యోల్బణం ఇప్పటికే తగ్గడం మొదలైందని, వినియోగదారుల ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం దిగివస్తున్నట్టు గుర్తుచేసింది. ఏప్రిల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 18 నెలల కనిష్ఠాన్ని తాకుతూ 4.7 శాతంగా నమోదైనది తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటిదాకా రెపోరేటును పెంచుతూ వచ్చిన ఆర్బీఐ.. ఇక కోతల దిశగా అడుగులు వేస్తుందన్నదీ అంతర్జాతీయ సంస్థ. ‘రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ.. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడితే ఇప్పుడు అనుసరిస్తున్న కఠిన ద్రవ్య విధానానికి విరామం ఇచ్చేందుకు వీలు చిక్కుతుందని చెప్పింది.
మా అంచనా ప్రకారం ఈ ఏడాది ముగిసేలోగానే ఆ సమయం రావచ్చు’ అని ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ చెప్పింది. అయితే ఈ ఏడాది జనవరి-మార్చిలో ఆర్థిక వ్యవస్థ కుదురుకున్నదనిపించినా.. అంతర్జాతీయం గా మళ్లీ మందగమనం ఆవరించిందని, ఈ ప్రభావం భారత్సహా అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలపైనా దీర్ఘకాలం పడనున్నదని హెచ్చరించింది. కాగా, రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికే (ఎట్టి పరిస్థితుల్లో 6 శాతం దాటవద్దు) పరిమితం చేయాలని ఆర్బీఐ లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏప్రిల్లో నిర్వహించిన ద్రవ్యసమీక్షలో ఆశ్చర్యకరంగా ఆర్బీఐ రెపోరేటు జోలికి వెళ్లని సంగతీ విదితమే. ప్రస్తుతం రెపోరేటు 6.5 శాతం వద్ద ఉన్నది. నిరుడు మే నుంచి 2.5 శాతం లేదా 250 బేసిస్ పాయింట్లు పెంచింది.