న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్లో దేశ స్ధూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 5.4 శాతంగా నమోదైంది. మూడో క్వార్టర్లో దేశ జీడీపీ గణాంకాలను జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్ఓ) విడుదల చేసింది. అంతకుముందు క్వార్టర్తో పోలిస్తే డిసెంబర్ క్వార్టర్లో జీడీపీ వృద్ధి రేటు తక్కువగా నమోదవడం గమనార్హం. 2021-22 రెండవ క్వార్టర్లో దేశ ఆర్ధిక వ్యవస్ధ 8.4 శాతం వృద్ధి రేటు కనబరిచింది.
ఇక ఇదే ఏడాది తొలి త్రైమాసికంలో ఆర్ధిక వ్యవస్ధ బేస్ ఎఫెక్ట్ కారణంగా ఏకంగా 20.3 శాతం ఎగబాకింది. ఇక డిసెంబర్ క్వార్టర్లో చైనా జీడీపీ భారత్ కంటే తక్కువగా కేవలం 4 శాతం పెరగింది. ఇక 2020-21లో ఇదే క్వార్టర్లో జీడీపీ వృద్ధి 0.7 శాతంగా నమోదైంది. 2021-22లో సవరించిన అంచనాల ప్రకారం భారత జీడీపీ 8.9 శాతం వృద్ధి చెందుతుందని ఎన్ఎస్ఓ గణాంకాలు వెల్లడించాయి. ఈ ఏడాది జనవరిలో కీలక మౌలిక రంగాలు 3.7 శాతం వృద్ధి రేటును కనబరచగా ఈ రంగాల్లో గత ఏడాది ఇదే నెలలో వృద్ధి కేవలం 1.3 శాతానికి పరిమితమైంది.
బొగ్గు, సహజవాయువు, సిమెంట్ పరిశ్రమలు మెరుగైన పనితీరు కనబరచడంతో ప్రోత్సాహకర వృద్ధి రేటు సాధ్యమైంది. అయితే జనవరిలో ముడిచమురు, ఎరువుల తయారీ ప్రతికూల వృద్ధిని నమోదు చేశాయి. డిసెంబర్ 2021లో కీలక రంగాలు 4.1 శాతం వృద్ధి రేటును నమోదు చేశాయని ఎన్ఎస్ఓ గణాంకాలు వెల్లడించాయి. జనవరిలో బొగ్గు ఉత్పత్తి 8.2 శాతం, సహజవాయువు 11.7 శాతం, రిఫైనరీ ఉత్పత్తులు 3.7 శాతం, సిమెంట్ ఉత్పత్తి 13.6 శాతం పెరిగింది.