Sovereign Gold Bond | కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో రెండు విడతలుగా సావరిన్ గోల్డ్ బాండ్లను జారీ చేయనున్నది. తొలి విడుత బాండ్లు ఈ నెలలో, మరో విడుత బాండ్లు ఫిబ్రవరిలో విడుదల చేయనున్నది. ఈ నెల 18-22 మధ్య తొలి విడుత బాండ్లు, ఫిబ్రవరి 12-16 మధ్య మరో విడుత బాండ్లు విడుదల చేయనున్నది. అయితే, ఆయా బాండ్ల ధర ఎంత అన్నది వెల్లడించలేదు. ఈ సావరిన్ గోల్డ్ బాండ్లలో పెట్టుబడులపై వచ్చే లాభాల గురించి తెలుసుకుందాం..
సావరిన్ గోల్డ్ బాండ్ కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తుంది. ఈ బాండ్ను డీమ్యాట్ ఖాతాలోకి మార్చుకోవచ్చు. ఒక గ్రామ్ బంగారంపై ఒక బాండ్ ఉంటుంది. ఒక గ్రామ్ బంగారం ధర ఈ బాండ్కు వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వం తరఫున ఆర్బీఐ ఈ బాండ్లను జారీ చేస్తుంది. ఈ బాండ్లకు డిజిటల్ పేమెంట్ చేసినా, ఆన్ లైన్లో బాండ్లకోసం దరఖాస్తు చేసినా ఒక గ్రామ్ బాండ్ పై రూ.50 రాయితీ లభిస్తుంది.
మీరు సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్జీబీ) లో 24 క్యారెట్స్ (99.9 శాతం స్వచ్ఛత) బంగారంపై పెట్టుబడి పెట్టొచ్చు. సావరిన్ గోల్డ్ బాండ్లపై ఏటా 2.50 శాతం వడ్డీ ఆదాయం లభిస్తుంది. ఒకవేళ డబ్బు అవసరమైతే ఈ బాండ్లపై రుణం కూడా లభిస్తుంది.
సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్జీబీ) సబ్ స్క్రిప్షన్ ప్రారంభం కావడానికి చివరి మూడు రోజుల్లో ఇండియన్ బులియన్ అండ్ జ్యువెల్లర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) బంగారం ధర సగటున బాండ్ విలువను ఖరారు చేస్తారు.
సావరిన్ గోల్డ్ బాండ్ల స్వచ్ఛతపై ఆందోళన చెందనవసరం లేదు. ఐబీజేఏ నిర్ణయించిన ధరతో బాండ్ ధరను అనుసంధానం చేస్తారు. ఈ బాండ్లను డీమ్యాట్ ఖాతాల్లో దాచి పెట్టుకోవచ్చు. ఈ బాండ్లు సురక్షితం అని బులియన్ నిపుణులు చెబుతున్నారు.
ఒక వ్యక్తి గరిష్టంగా నాలుగు కిలోల విలువైన బాండ్లు కొనుగోలు చేయొచ్చు. ట్రస్టులు 20 కిలోల వరకూ బాండ్లపై పెట్టుబడి పెట్టొచ్చు. సావరిన్ గోల్డ్ బాండ్ల మెచ్యూరిటీ గడువు ఎనిమిదేండ్లు. మెచ్యూరిటీ తీరిన తర్వాత వచ్చే లాభాలపై పన్ను రాయితీ ఉంటుంది. అత్యవసరం అయితే ఐదేండ్ల తర్వాత విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే దీర్ఘకాలిక పెట్టుబడి లాభాలు (ఎల్టీసీజీ) రూపంలో 20.80 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటది.