హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ) : లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఆయా రంగాల్లో రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేసేలా నార్వే పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని ఆ దేశ ఉన్నత స్థాయి బృందాన్ని కోరారు.
ఈ మేరకు మంగళవారం సచివాలయంలో నార్వే దేశ రాయబారి మే ఎలిన్ స్టెనర్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం మంత్రి శ్రీధర్బాబుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహించేందుకు తీసుకుంటున్న చర్యలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ పాలసీలు, పరిశ్రమల ఏర్పాటుకున్న అనుకూలతలు, అవకాశాలను మంత్రి ఈ సందర్భంగా వివరించారు.
ఏఐ, ైక్లెమేట్ టెక్, హెల్త్ టెక్, డీప్ టెక్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ పబ్లిక్ సర్వీసెస్, గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ టెక్నాలజీ, ఎలక్ట్రిక్ మొబిలిటీ, క్లీన్ ఎనర్జీ, ఇండస్ట్రీయల్ డీ కార్బనైజేషన్, గ్రీన్ మ్యాన్యుఫ్యాక్చరింగ్, డిజిటల్ హెల్త్, బయోటెక్, మెడికల్ డివైజెస్ తదితర అంశాల్లో కలిసి పనిచేసేందుకు గల అవకాశాలపై ‘కాంప్రహెన్సివ్ రోడ్డు మ్యాప్’ను సిద్ధం చేసుకుని ముందుకెళ్తామన్నారు.
ఇందుకోసం ప్రత్యేకంగా ‘తెలంగాణ-నార్వే వర్కింగ్ గ్రూప్’ను ఏర్పాటు చేద్దామని మంత్రి శ్రీధర్ బాబు ప్రతిపాదించారు. మంత్రి ప్రతిపాదనలకు నార్వే రాయబారి మే ఎలిన్ స్టెనర్ స్పందిస్తూ.. వర్కింగ్ గ్రూప్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అలాగే, ఇటలీ రాయబారి ఆంటోనియో బార్టోలి నేతృత్వంలోని ప్రతినిధుల బృందంతో మంత్రి సమావేశమయ్యారు.