న్యూఢిల్లీ : అవినీతి, పన్ను ఎగవేతలకు పాల్పడిన చైనా మొబైల్ తయారీ దిగ్గజాలు షియామి, వివోలపై ఈడీ, ఆదాయ పన్ను అధికారులు చర్యలు చేపడుతుండగా తాజాగా మరో చైనా మొబైల్ కంపెనీ ఒప్పోపై పన్ను అధికారులు దృష్టి సారించారు. రూ 4389 కోట్ల మేరకు కస్టమ్స్ డ్యూటీ ఎగవేతకు పాల్పడిందని ఒప్పోపై ఆరోపణలున్నాయి.
ఒప్పో భారత్ సబ్సిడరీ ఒప్పో మొబైల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో తనిఖీల అనంతరం కంపెనీ రూ 4389 కోట్లకు పన్ను ఎగవేతలకు పాల్పడిందని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజన్స్ (డీఆర్ఐ) గుర్తించింది. ఒప్పో ఇండియా భారత్లో మొబైల్ ఫోన్ల తయారీ, అసెంబ్లింగ్, హోల్సేల్ ట్రేడింగ్, మొబైల్ ఫోన్ల పంపిణీ, యాక్సెసరీస్ల వంటి వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ఒప్పో, వివోతో పాటు రియల్మి, వన్ప్లస్, ఐక్యూఓఓలను చైనాకు చెందిన బీబీకే ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ప్రమోట్ చేస్తోంది.
ఇక ఒప్పో ఇండియా కార్యాలయాలు, కీలక మేనేజ్మెంట్ ఉద్యోగుల కార్యాలయాలు, నివాసాల్లో జరిగిన సోదాల్లో కంపెనీ పలు అక్రమాలకు పాల్పడట ద్వారా పన్ను ఎగవేతలకు పాల్పడినట్టు డీఆర్ఐ అధికారులు గుర్తించారు. కంపెనీ సీనియర్ మేనేజ్మెంట్ అధికారులు, ఒప్పో ఇండియా దేశీ సరఫరాదారులను డీఆర్ఐ అధికారులు ప్రశ్నించారు. పరికరాల దిగుమతి సమయంలో కస్టమ్స్ అధికారులకు తప్పుడు పత్రాలు, సమాచారం అందించామని దర్యాప్తులో వారు అంగీకరించారని తెలిసింది.