Opec on Crude | నిత్యావసర వస్తువుల ధరల కట్టడికి వివిధ దేశాలు వడ్డీరేట్లు పెంచేస్తున్నాయి. దీని ఫలితంగా ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం గుప్పిట్లోకి వెళుతుందన్న భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ తరుణంలో ముడి చమురు ఉత్పత్తి చేస్తున్న ఒపెక్ + దేశాలు క్రూడ్ ఆయిల్ ధర పతనంపై ఆందోళన చెందుతున్నాయి. ఈ నెల ఐదో తేదీన వియాన్నాలో ఒపెక్ + దేశాల సదస్సు జరుగనున్నదని సంబంధిత వర్గాలు శనివారం తెలిపాయి.
అతి తక్కువ కాలంలో సదస్సు ఖరారు కావడంతో ఒపెక్+ దేశాల ప్రతినిధుల్లో కొందరు వర్చువల్గా హాజరవుతారని భావిస్తున్నారు. ఒపెక్ దేశాలతోపాటు రష్యా మిత్ర దేశాలతో కలిపి ఒపెక్ + అని పిలుస్తారు. మార్చిలో కొన్నేండ్ల గరిష్ఠ స్థాయికి చేరుకున్న క్రూడాయిల్ ధర భారీగా పతనమైంది. మార్కెట్లో నెలకొన్న తీవ్ర అనిశ్చిత పరిస్థితుల్లో ఈ సమావేశం జరుగుతున్నది.
ఒపెక్ + దేశాలు ముడి చమురు ఉత్పత్తి తగ్గించడంపైనే చర్చలు సాగిస్తాయని సమావేశం దృష్టి సారిస్తాయని సమాచారం. మార్కెట్కు మద్దతుగా రోజు ఐదు లక్షల బ్యారెల్స్ ముడి చమురు ఉత్పత్తి తగ్గించాలని యోచిస్తున్నట్లు తెలుస్తున్నది. రష్యా మాత్రం పది లక్షల బీపీడీ క్రూడ్ తగ్గించాలని సూచిస్తుందని తెలియవచ్చింది. కానీ ఒపెక్ వర్గాలు మాత్రం ఐదు లక్షల బీపీడీ తగ్గింపునకు పరిమితం కావాలని భావిస్తున్నట్లు వినికడి.