హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ కేంద్రంగా తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు ప్రపంచంలోని అతిపెద్ద ప్రైవేట్ ఈక్విటీ సంస్థల్లో ఒకటైన అడ్వెంట్ ఇంటర్నేషనల్ ముందుకొచ్చింది. ఇక్కడ తమ కోహెన్స్ లైఫ్సైన్సెస్ ప్లాట్ఫాం ప్రధాన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నది. శుక్రవారం ప్రగతిభవన్లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావుతో అడ్వెంట్ ఎండీ పంకజ్ పట్వారీ నేతృత్వంలోని ఓ బృందం సమావేశమైంది. ఇందులో సంస్థ ఆపరేటింగ్ పార్ట్నర్ వైదీశ్ అన్నాస్వామి సైతం ఉన్నారు. ఈ సందర్భంగా కంపెనీ పెట్టుబడులు, విస్తరణ, భవిష్యత్తు ప్రణాళికలపై మంత్రితో వీరంతా చర్చించారు. ఈ క్రమంలోనే రూ.16,650 కోట్ల (2 బిలియన్ డాలర్లు) పెట్టుబడులు పెట్టేందుకు అడ్వెంట్ సిద్ధమైంది. కేటీఆర్ అమెరికా పర్యటనలో చేసిన కృషిలో భాగంగానే ఈ పెట్టుబడులు రావడం విశేషం. నాడు అడ్వెంట్ ఇంటర్నేషనల్ మేనేజింగ్ పార్ట్నర్ 14వ పేజీలో
జాన్ మల్డొనాడొతో జరిగిన సమావేశంలో హైదరాబాద్ లైఫ్సైన్సెస్, ఫార్మా ఎకో సిస్టం గురించి విస్తృతంగా చర్చించినట్టు పంకజ్ పట్వారి ప్రత్యేకంగా ప్రస్తావించారిప్పుడు. ఇక ఆసియా లైఫ్సైన్సెస్ రంగంలోకి వచ్చిన భారీ పెట్టుబడుల్లో ఒకటిగా అడ్వెంట్ పెట్టుబడులు నిలుస్తుండటం గమనార్హం. దీంతో తెలంగాణ లైఫ్సైన్సెస్ రంగానికీ ఇది కిక్కిస్తున్నది. కాగా, హైదరాబాద్కు చెందిన సువెన్ ఫార్మాస్యూటికల్స్లో రూ.9,589 కోట్లతో 76.1 శాతం వాటాను అడ్వెంట్ సొంతం చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నగరంలో తమ కోహెన్స్ ప్లాట్ఫామ్ హెడ్క్వార్టర్స్ను తీసుకురావాలని నిర్ణయించింది.
జీనోమ్ వ్యాలీలో ఆర్ అండ్ డీ ల్యాబ్
జీనోమ్ వ్యాలీలో 50 వేల చదరపు అడుగుల్లో ఓ ఆర్ అండ్ డీ (రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్) ల్యాబ్ను అడ్వెంట్ ఏర్పాటు చేయబోతున్నది. తద్వారా ఏపీఐ, కాంట్రాక్ట్ డెవలప్మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో అగ్రస్థానంలో నిలిచేందుకు కంపెనీ ప్రయత్నిస్తున్నది. కాగా, అడ్వెంట్ తమ భారతీయ యాక్టీవ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్ (ఏపీఐ), కాంట్రాక్ట్ డెవలప్మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ (సీడీఎంవో) వ్యాపార విభాగాలకు కోహెన్స్ లైఫ్సైన్సెస్గా నామకరణం చేసిన విషయం తెలిసిందే. ఇందులో ఆర్ఏ కెమ్ ఫార్మా, జెడ్సీఎల్ కెమికల్స్, అవ్రా లాబొరేటరీస్ కంపెనీలూ భాగమై ఉంటాయి.
అన్ని రకాలుగా సహకరిస్తాం: కేటీఆర్
హైదరాబాద్ నగరంలో అడ్వెంట్ ఇంటర్నేషనల్ తమ పోర్ట్ఫోలియోను భారీగా విస్తరించుకోవడంపట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోకి వస్తున్న ఈ పెట్టుబడులు.. తెలంగాణ ఐటీ, లైఫ్సైన్సెస్ ఎకో సిస్టం బలానికి నిదర్శనం అన్నారు. రాష్ట్రం ఏర్పడిన దగ్గర్నుంచి లైఫ్సైన్సెస్ ఎకో సిస్టమ్ బలోపేతానికి ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని రకాల కార్యక్రమాలను చేపట్టామని, ముఖ్యంగా పరిశ్రమ భాగస్వాములతో కలిసి చేపట్టిన అనేక కార్యక్రమాలు సత్ఫలితాల్ని ఇస్తున్నాయన్నారు. ఇక తెలంగాణ కేంద్రంగా అడ్వెంట్ ఇంటర్నేషనల్ ఆకర్షణీయమైన వృద్ధిని సాధిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే సంస్థకు అవసరమైన అన్ని రకాల సహాయ, సహకారాలను అందిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. మరోవైపు హైదరాబాద్ లైఫ్సైన్సెస్ ఎకో సిస్టంపై అడ్వెంట్ ఎండీ పంకజ్ పూర్తి విశ్వాసాన్ని కనబర్చారు. ఇక్కడి ఇన్నోవేషన్, వృద్ధి అవకాశాలను దృష్టిలో ఉంచుకొనే తమ సంస్థ ఈ భారీ పెట్టుబడుల నిర్ణయాన్ని ప్రకటించిందని తెలిపారు. కోహెన్స్ లైఫ్సైన్సెస్ ద్వారా భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, తెలంగాణ లైఫ్సైన్సెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శక్తి నాగప్పన్ తదితరులు పాల్గొన్నారు.
అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ అతిపెద్ద సంస్థల్లో ఒకటైన అడ్వెంట్ ఇంటర్నేషనల్..అంతర్జాతీయంగా తన వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. వ్యూహాత్మక పెట్టుబడుల్లో భాగంగా యూరప్తోపాటు ఉత్తర అమెరికా, లాటిన్ అమెరికా, ఆసియా దేశాల్లో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నది. 1984 నుంచి ఇప్పటి వరకు సంస్థ 56 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టింది. 42 దేశాల్లో 375 లావాదేవీల ద్వారా కొనుగోళ్లు జరిపింది. 11 దేశాల్లోవున్న 14 కార్యాలయాల్లో 240కి పైగా ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు.
అడ్వెంట్ ఇంటర్నేషనల్
ఇండస్ట్రీ :ప్రైవేట్ ఈక్విటీ
ప్రధాన కార్యాలయం :బోస్టన్, అమెరికా
ప్రారంభం :1984
వ్యవస్థాపకుడు :పీటర్ బ్రూక్
ఉద్యోగులు :475కి పైగా
అసెట్ అండర్ :89 బిలియన్ డాలర్లు
మేనేజ్మెంట్ (2022 నాటికి)