Electric Cars | గతంతో పోలిస్తే ప్రతి ఒక్కరూ పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు తడిసి మోపెడవుతుండటంతోపాటు కర్బన ఉద్గారాల నియంత్రణ కోసం ఆల్టర్నేటివ్ ఫ్యూయల్.. ప్రత్యేకించి ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద క్రేజ్ పెంచుకుంటున్నారు. ఇంతకుముందుతో పోలిస్తే ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతున్నదని జర్మనీ విలాస కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ తెలిపింది. అంచనాల కంటే ఎక్కువగా విద్యుత్ కార్ల విక్రయాలు జరుగుతున్నాయని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ కం సీఈఓ విక్రం ప్రవాహ్ తెలిపారు. ఇప్పుడు 10 శాతంగా ఉన్న ఈవీ కార్ల సేల్స్.. వచ్చే ఏడాది 15, 2025లో 25 శాతానికి పెరుగుతాయన్నారు.
భారత్ మార్కెట్లో పట్టు సాధించేందుకు మున్ముందు మరిన్ని మోడల్ కార్లు ఆవిష్కరిస్తామని విక్రమ్ ప్రవాహ్ చెప్పారు. కానీ, పూర్తి వివరాల వెల్లడికి నిరాకరించారు. ఆడి ఇండియా, మెర్సిడెజ్ బెంజ్, వోల్వో కార్స్ ఇండియా కంటే ఎక్కువగా బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ లగ్జరీ కార్ల విక్రయాలు 48 శాతం జరుగుతున్నాయి. బీఎండబ్ల్యూ సంస్థ భారత్ మార్కెట్లో ఐ4 (i4), ఐ7 (i7), ఐఎక్స్ (iX), ఐఎక్స్1 (iX1), మినీ ఎలక్ట్రిక్ (Mini Electric) మోడల్ కార్లను విక్రయిస్తున్నది. 2025లో కొత్తగా 12 ఈవీ కార్ల ఆవిష్కరణకు రంగం సిద్ధం చేసుకుంటున్నది.
గతేడాది బీఎండబ్ల్యూ 11981 కార్లు విక్రయించింది. దేశంలో బీఎండబ్ల్యూ సేల్స్లో ఇదే గరిష్ట రికార్డు. ఈ ఏడాది తొమ్మిది నెలల్లోనే 9,580 కార్ల సేల్స్లో 10 శాతం గ్రోత్ రికార్డ్ నమోదు చేసింది. లగ్జరీ కార్ల సెగ్మెంట్లో టాప్ హైఎండ్ వేరియంట్లు ఎక్కువగా అమ్ముడు పోతున్నాయి. కస్టమర్లు `ఎక్స్1` వంటి కార్లపై మోజు పెంచుకోవడం వల్లే తమ లగ్జరీ కార్ల మార్కెట్ పెరుగుతోందని విక్రమ్ ప్రవాహ్ తెలిపారు.