శంషాబాద్(నమస్తే తెలంగాణ), ఆగస్టు 9: జీఎమ్మార్ హైదరాబాద్(శంషాబాద్) అంతర్జాతీయ విమానాశ్రయానికి మరో అవార్డు వరించింది. భారత్లో ఉత్తమ ప్రాంతీయ విమానాశ్రయ విభాగంలో ఈ అవార్డు లభించింది. స్కైట్రాక్స్ ప్రపంచ స్థాయి ఎయిర్పోర్టు అవార్డులు- 2021లో ‘బెస్ట్ రీజినల్ ఎయిర్పోర్టు ఇన్ ఇండియా అండ్ సెంట్రల్ ఆసియా’ అవార్డుతోపాటు సెంట్రల్ ఆసియా అవార్డును గెలుచుకున్నట్లు సోమవారం కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. అవార్డు గెలుచుకోవడం ఇది మూడోసారి కావడం విశేషం. అలాగే ప్రపంచంలో టాప్ 100 విమానాశ్రయాల్లో 71వ స్థానం నుంచి 64 స్థానానికి శంషాబాద్ ఎయిర్పోర్టు చేరింది. ఈ సందర్భంగా ఎయిర్పోర్టు సీఈవో ప్రదీప్ ఫణికర్ మాట్లాడుతూ.. కరోన మహమ్మారి సమయంలో నిబద్దతతో సేవలందించిన విమానాశ్రయ సిబ్బంది, భాగస్వాములందరికి ఈ అవార్డు అంకితమన్నారు.