Top Electric Scooters : పెట్రోల్ ధరలు ( Petrol Price ) రోజురోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పటికే లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటింది. ఈ రేటు ఇంకా పైకి ఎగబాకుతూనే ఉంది. పెరుగుతున్న పెట్రో ధరలతో సామాన్యుడు బైక్ బయటకు తీయాలంటేనే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నాడు. ఇలాంటి సమయంలో అందరిచూపు ఎలక్ట్రిక్ స్కూటర్లపైనే ! పెరుగుతున్న పెట్రోలు ధరలతో పాటు పర్యావరణహితంగా ఉండటంతో ఇప్పుడు ఈ-వెహికిల్స్కు ఆదరణ పెరుగుతోంది. దీంతో భారత విపణిలోకి విడుదలయ్యే ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య కూడా పెరిగింది. ఇప్పటికే హీరో ( Hero ), టీవీఎస్ ( TVS ), బజాజ్ ( Bajaj ) వంటి టూవీలర్ల తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్ స్కూటర్లను విపణిలోకి తీసుకొచ్చాయి. వీటికి పోటీగా ప్రముఖ క్యాబ్ సర్వీసెస్ సంస్థ ఓలా ( Ola ) కూడా తమ కంపెనీ నుంచి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. బజాజ్ ఎలక్ట్రిక్ చేతక్, ఏథర్ ఎనర్జీ స్కూటర్లకు ఇది గట్టి పోటీనిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల ప్రత్యేకత ఏంటి? ఇప్పటివరకు అందుబాటులో ఉన్న టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఏంటి అనే విషయాలు ఒకసారి చూద్దాం..
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్లకు సంబంధించి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ సీఈవో భవిష్ అగర్వాల్ తాజాగా ఒక ట్వీట్ చేశారు. ఈ స్కూటర్ను ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 150 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. కేవలం 18 నిమిషాల్లోనే 50 శాతం ఛార్జింగ్ నిండుతుంది. దీంతో 75 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. గరిష్ఠంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ఈ స్కూటర్ దూసుకెళ్లనుంది. ఈ స్కూటర్ సీటు కింది భాగంలో రెండు హాఫ్ హెల్మెట్లు పెట్టేంత ఖాళీ ప్రదేశం ఉంటుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ కోసం తమిళనాడులో రూ.2400 కోట్ల పెట్టుబడి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ప్రొడక్షన్ ప్లాంట్ నిర్మిస్తున్నది.
ఆటో దిగ్గజ కంపెనీ బజాజ్ నుంచి వస్తున్న ఈ ఎలక్ట్రిక్ చేతక్పై విపరీతమైన క్రేజ్ నెలకొంది. ఈ స్కూటర్ కోసం జనాలు ఎగబడి మరి బుకింగ్లు కూడా చేసుకున్నారు. వీటిని సెప్టెంబర్లో డెలివరీ ఇవ్వబోతున్నారు. ఈ చేతక్ అర్బన్, ప్రీమియం రెండు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలను రూ.1.22 లక్షలు, రూ.1.26 లక్షలు (ఎక్స్ షోరూం ప్రైజ్) గా నిర్ణయించారు. వీటిలో ఐపీ 6 వాటర్ రెసిస్టెన్స్ లిథియం ఐయాన్ బ్యాటరీని అమర్చారు. ఒకసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే ఎకో మోడ్లో 95 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.
ఏథర్ ఎనర్జీ ఇటీవల ఏథర్ 450 ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ను భారత విపణిలోకి తీసుకొచ్చింది. ఇందులో ఎకో, రైడ్, స్పోర్ట్స్, వార్ప్ అనే నాలుగు రైడింగ్ మోడ్లు ఉన్నాయి. ఒకసారి ఫుల్ ఛార్జింగ్ పెడితే ఎకో మోడ్లో 85 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఈ మోడ్లో కేవలం మూడు సెకన్లలోనే 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఇన్బిల్ట్ 4జీ సిమ్కార్డుతో పాటు ఏడు అంగుళాల టచ్ స్క్రీన్ డ్యాష్బోర్డు వస్తుంది. దీన్ని బ్లూటూత్ ద్వారా మొబైల్కు కనెక్ట్ చేసుకుని కాల్స్, మ్యూజిక్ను మేనేజ్ చేసుకోవచ్చు. 450 ఎక్స్ ధరను రూ. 1,61,426 ( ఎక్స్ షోరూం)గా నిర్ణయించారు.
ద్విచక్రవాహనాల మార్కెట్లో హీరో కంపెనీకి మంచి డిమాండ్ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎలక్ట్రిక్ బైక్ల తయారీలోకి కూడా ఈ కంపెనీ దిగింది. బడ్జెట్లో వివిధ రకాల ఎలక్ట్రిక్ స్కూటర్లను అందుబాటులోకి తెచ్చింది. వీటిలో ఎలక్ట్రిక్ ఆప్టిమా మోడల్ కస్టమర్లను ఎక్కువగా ఆకట్టుకుంటోంది. దీని ధర రూ.50వేల లోపే ఉండటం విశేషం. ఈ స్కూటర్లో 250 W హబ్ మోటార్ ఉంటుంది. ఈ స్కూటర్ పూర్తిగా ఛార్జ్ అవ్వడానికి ఐదు గంటల సమయం పడుతుంది. ఇది రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది.
టీవీఎస్ బ్రాండ్ నుంచి వచ్చిన ఈ ఐక్యూబ్ స్కూటర్పై గంటకు 78 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో ప్రయాణించవచ్చు. కేవలం 4.2 సెకన్లలోనే ఇది 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 75 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావడానికి ఐదు గంటల సమయం పడుతుంది. దీని ఛార్జింగ్ కేబుల్ను సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. దీని ధర లక్షకు పైగానే ఉంది.
హీరో కంపెనీకి చెందిన ఈ ఎలక్ట్రిక్ ఫ్లాష్ కేవలం రూ.50వేల లోపే వస్తుంది. ఇందులో 250 W మోటర్ ఉంది. ఇది రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఒక్కసారి ఛార్జి చేస్తే 65కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. నాలుగు నుంచి 5 గంటల్లో బ్యాటరీ పూర్తిగా ఛార్జి అవుతుంది.
Hero ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఫోటాన్ కూడా జనాలను ఆకర్షిస్తోంది. ఈ స్కూటర్ను ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 108 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. కాకపోతే ఇది గంటకు 45 కిలోమీటర్లకు మంచి వేగంతో వెళ్లదు. దీని బ్యాటరీ ఐదు గంటల్లో ఫుల్ అవుతుంది. దీని ధర 70వేల పైన ఉంది.
ఒకినావా ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఎక్కువగా అమ్ముడుపోతున్న మోడల్ ఐప్రైస్ ప్లస్. దీన్ని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 139 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. దీనిపై గరిష్ఠంగా గంటకు 58కిలోమీటర్ల వేగంతో వెళ్లవచ్చు. నాలుగు నుంచి ఐదు గంటల్లోనే బ్యాటరీ ఫుల్ అవుతుంది. ఈ బ్యాటరీపై మూడు సంవత్సరాల వారంటీ కూడా లభిస్తుంది.
భారత్లో అతి తక్కువ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్లను అందిస్తున్న సంస్థ ఎనిగ్మా. ఈ సంస్థ 2016 నుంచి తమ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ క్రింక్లో రెండు బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. వీటిలో శక్తివంతమైన లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. దీన్ని పూర్తిగా ఛార్జ్ చేయడానికి నాలుగు గంటల సమయం పడుతుంది. ఒకసారి ఛార్జి చేస్తే 140 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.
తక్కువ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్లను అందిస్తున్న కంపెనీల్లో ఈవీ ఇండియా ఒకటి. భారత మార్కెట్కు సరిపోయే విధంగా ఈ కంపెనీ తమ స్కూటర్లను ప్రత్యేకంగా డిజైన్ చేస్తోంది. ఈ కంపెనీ నుంచి ఆరు మోడళ్లు భారత విపణిలో అందుబాటులో ఉండగా.. అట్రియో కస్టమర్లను ఎక్కువగా ఆకర్షిస్తోంది. ఐదేళ్ల వారంటీతో ఈ స్కూటర్లు లభిస్తున్నాయి. ఒకసారి ఛార్జి చేస్తే 90 నుంచి 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. బ్యాటరీని ఫుల్ చేయడానికి 7 నుంచి 8 గంటల సమయం పడుతుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Monsoon Diet : వర్షాకాలంలో ఇమ్యూనిటీ పెంచుకోవాలా? వీటిని ఆహారంగా తీసుకోండి
క్రిప్టోలపై ఆర్బీఐ శీతకన్ను..కస్టమర్ల కంప్లైంట్ల వర్షం.. ఎందుకంటే?!
ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోప్.. రెండు ఖండాల్లో నిర్మాణం ప్రారంభం
ఫోన్ సిగ్నల్ లేని చోటికి కూడా హైస్పీడ్ ఇంటర్నెట్.. అసలేంటి వన్వెబ్ ?