హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ) : ఎన్నారై బీఆర్ఎస్ యూకే యువజన విభాగాన్ని మరింత బలోపేతం చెయ్యాలనే సంకల్పంతో ప్రత్యేక కమిటీనీ ఏర్పాటు చేసినట్టు ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ సెల్ అధ్యక్షుడు నవీన్రెడ్డి ప్రకటించారు. యూకేలో వివిధ ప్రాంతాలలో నివసిస్తున్న ఎంతో మంది యువతీ యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని శుక్రవారం ఆయన వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా యావత్ భారత దేశంలో యువతకు ఆదర్శంగా నిలిచిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో పని చేయడం ఎంతో సంతోషంగా ఉందని నవీన్ రెడ్డి తెలిపారు.
విద్యార్థులకు నిరుద్యోగ యువతకు 10 సంవత్సరాల్లో కేసీఆర్ ఎన్నో రకాల కార్యక్రమాలతో వారి అభివృద్ధికి కృషి చేశారని నవీన్ రెడ్డి పేర్కొన్నారు. మళ్లీ కేసీఆర్ను ముఖ్యమంత్రిగా చేస్తేనే వీరందరికీ తగిన న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్టు ఎన్నారై బీఆర్ఎస్ యూకే యువజన విభాగం సభ్యులు తెలిపారు. యువత తలుచుకుంటే రాజ్యాలే పడిపోయాయి అని గుర్తు చేసిన నవీన్ రెడ్డి నూతన ఎన్నారై బీఆర్ఎస్ యూకే యువజన విభాగం నాయకులకు శుభాకాంక్షలు చెప్పారు. క్రమ శిక్షణతో పని చేసి పార్టీకి, నాయకుడికి మంచి పేరు తీసుకుని రావడం, తోటి తెలంగాణ ఎన్నారైలకు కూడా సేవ చేయాలని ఎన్నారై బీఆర్ యూకే వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం తెలిపారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు నవీన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత కమిటీని మరింత బలోపేతం చేస్తూ.. అదనంగా యువజన విభాగంతో పాటు ఇతర బాధ్యులని కూడా చేర్చామని తెలిపారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా.. తమ వంతు కృషి చేసి పార్టీకి అండగా ఉంటామని సభ్యుల వివరాలు హామీ ఇచ్చారని నవీన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ ప్రశాంత్ మామిడాల, పవన్కళ్యాణ్, తరుణ్ లూనావత్, హరికృష్ణ మామిళ్ల, అబ్ధుల్ క్కద్దోస్, అమరేశ్వరి బోయిని, కిరణ్రావు పేరాల, సాకేత్ కాచవరపు, నర్సింగరావు, జనార్థన్ దమ్మక్కపల్లి తదితరులు పాల్గొన్నారు.