న్యూఢిల్లీ: దాదాపు ఏడాది కాలానికి పైగా వెలుగు వెలిగిన క్రిప్టో కరెన్సీలకు ఓ కొత్త సమస్య వచ్చి పడింది. వాటి లావాదేవీలు, బదిలీలు, చెల్లింపుల విషయమై పలు కంప్లయింట్లు వచ్చి పడుతున్నాయి. క్రిప్టో లావాదేవీలకు భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) వ్యతిరేకంగా ఉండటం కూడా ఒక కారణం అని తెలుస్తున్నది.
ఇటీవల క్రిప్టో కరెన్సీల విలువ పడిపోవడంతో వాటి స్థిరత్వంపై కేంద్రీకరించాలని బ్యాంకర్లను ఆర్బీఐ ఆదేశించింది. వివిధ గేట్వే పేమెంట్స్ సంస్థలతో టైఅప్ గల బ్యాంకులు.. క్రిప్టో కరెన్సీల లావాదేవీలకు నిరాకరిస్తున్నాయి. ఫలితంగా క్రిప్టో కరెన్సీ కస్టమర్ల నుంచి ఫిర్యాదుల వర్షం వెల్లువెత్తుతున్నది.
బ్యాంకులు, పేమెంట్ గేట్ వేస్తో లావాదేవీలు తేలిగ్గా జరిగేందుకు పలు క్రిప్టో కరెన్సీ ఏజెన్సీలు పరిష్కార మార్గాల కోసం చేస్తున్నాయి. ఈ డిజిటల్ కరెన్సీకి వ్యతిరేకంగా ఆర్బీఐ ఉండటం వల్లే క్రిప్టో ఏజెన్సీలు సమస్యలను ఎదుర్కొంటున్నాయి. డిజిటల్ కరెన్సీ స్థిరత్వం ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది.
దేశంలోని అన్ని మేజర్ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్లకు కస్టమర్ల నుంచి ఫిర్యాదుల వర్షం వెల్లువెత్తుతున్నదని సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయి. ప్రధాన పేమెంట్ గేట్వే కంపెనీలన్నీ వెనుకడుగు వేయడం దీనికి కారణంగా కనిపిస్తున్నది. ఫలితంగా క్రిప్టో ట్రాన్సాక్షన్లపై ప్రతికూల ప్రభావం చూపుతున్నది.
క్రిప్టో కరెన్సీలతో లావాదేవీలు జరిపేందుకు బ్యాంకర్లు నిరాసక్తంగా ఉన్నారని దేశంలోనే ఓల్డెస్ట్ క్రిప్టో ఎక్స్చేంజ్ జెబ్ పే కో చీఫ్ ఎగ్జిక్యూటివ్ అవినాశ్ శేఖర్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో తత్కాల్ సెటిల్మెంట్ను ప్రక్రియను ఎంతో కాలం ఆఫర్ చేయలేమని జెబ్ పే పేర్కొంది.
స్మాల్ పేమెంట్ గేట్వేస్తో భాగస్వామ్యానికి గల అవకాశాలను పరిశీలిస్తున్నట్లు దేశంలోని ఐదు క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ల అధిపతులు తెలిపారు. సొంతంగా చెల్లింపుల ప్రక్రియ నిర్మాణం, ఇన్స్టంట్ సెటిల్మెంట్ పద్దతులను అవలంభించనున్నాయి. పెద్ద పేమెంట్ గేట్వేలతో లావాదేవీలు దెబ్బ తినడంతో వజీర్ ఎక్స్, కాయిన్ స్విచ్ ఎక్స్చేంజ్లు ఎయిర్ పేతో టైఅప్ చేసుకున్నాయి.
ఎయిర్ పే సంస్థ కలారీ క్యాపిటల్, ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్ ఝున్ వాలాలతో టై అప్ కలిగి ఉంది. క్రిప్టో కరెన్సీలకు రాకేశ్ ఝున్ఝున్ వాలా వంటి వారు బద్ధ వ్యతిరేకులు.
చిన్న పేమెంట్ గేట్వే సంస్థలు భారీ మొత్తంలో నగదు బదిలీలు, లావాదేవీలను విజయవంతంగా పూర్తి చేయలేకపోతున్నాయి. తత్ఫలితంగా కస్టమర్ల నుంచి ఫిర్యాదుల వరద వెల్లువెత్తుతున్నది.
దేశంలో దాదాపు 1.5 కోట్ల మంది క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులు పెడుతున్నారు. వారి పెట్టుబడులు 100 బిలియన్ల రూపాయల పై మాటే. ప్రస్తుత సంక్షోభ వేళ కొన్ని రోజులు వ్యక్తి నుంచి వ్యక్తికి లావాదేవీలను మాత్రమే పరిమితం చేయాలని వజీర్ ఎక్స్ నిర్ణయించింది. వాల్డ్ వంటి క్రిప్టో కంపెనీలు మ్యూచువల్ సెటిల్మెంట్ కింద బ్యాంకుల్లో లావాదేవీలను అనుమతినిస్తున్నాయి.
ప్రధాన పేమెంట్ గేట్వేస్.. రేజోర్ పే, పేయూ, బిల్ డెస్క్ వంటి సంస్థలు క్రిప్టో ఎక్స్చేంజ్లతో తెగదెంపులు చేసుకున్నాయి. ఈ గేట్వే సంస్థలు లావాదేవీలు నిర్వహించడానికి బ్యాంకులపైనే ఆధారపడటం ఒక కారణం.
బ్యాంకుల నుంచి మద్దతు కొరవడంతో చిన్న చిన్న సంస్థలు క్రిప్టో కరెన్సీ లావాదేవీల నుంచి వైదొలుగుతున్నాయి. ఒక ఇండియన్ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ ఫౌండర్ మాట్లాడుతూ చిన్న పేమెంట్ గేట్వే సంస్థలతో లావాదేవీలు సురక్షితం కాదన్నారు. చిన్న పేమెంట్ సంస్థలతో లావాదేవీలు కేవలం స్టాప్ గ్యాప్ అరేంజ్ మెంట్ మాత్రమే తప్ప, పరిష్కారం కాదని బిట్బిన్స్ సీఈవో గౌరవ్ దాహియా చెప్పారు.